Vahana Mitra Scheme: ఏపీలో వాహనమిత్ర డబ్బులు రూ.15 వేలు ఇచ్చేది వీరికే… చెక్ చేసుకోండి…
ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీశక్తి పథకాన్ని ఇప్పటికే ప్రారంభించారు. ఆ సమయంలోనే ఆటో డ్రైవర్లకు ఆర్థికసాయం అందిస్తామని చంద్రబాబు చెప్పారు.
- T Venkateshwarlu
- Published On : September 11, 2025 / 02:49 PM IST
auto-rickshaw drivers
Vahana Mitra Scheme: ఆంధ్రప్రదేశ్లో వాహనమిత్ర పథకం కింద ఆటోడ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఇవ్వనున్నారు. దసరా రోజున ఈ డబ్బు ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఈ పథకం కింద ఆ డబ్బు రావాలంటే సొంత వాహనం ఉండి దాన్ని నడిపే క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు అయి ఉండాలి. 2023-24లో 2.75 లక్షల మంది అర్హులు ఉన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 2.90 లక్షల మందికి పెరిగినట్లు తెలుస్తోంది. దీనికిగానూ రూ.435 కోట్లు ఖర్చు అవుతాయి. గత వైసీపీ పాలనలో వీరికి రూ.10 వేల చొప్పున ఇచ్చేవారు.
ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీశక్తి పథకాన్ని ఇప్పటికే ప్రారంభించారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఆ సమయంలోనే ఆటో డ్రైవర్లకు ఆర్థికసాయం అందిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆ హామీ ప్రకారం దసరా నుంచి వాహనమిత్ర పథకం కింద డ్రైవర్లకు సాయం అందించనున్నారు.
ఏపీలో గత ఏడాది లెక్కల ప్రకారం.. ఆటోడ్రైవర్లు 2.5 లక్షల మంది ఉండగా, ట్యాక్సీ, మ్యాక్సీక్యాబ్ల డ్రైవర్లు 25 వేల మంది ఉన్నారు. ఇప్పుడు వీరి సంఖ్య మరో 15 వేల వరకు పెరిగిందని అంచనా. (Vahana Mitra Scheme)
ఇప్పటికే రవాణా శాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు. ఏపీలోని ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీక్యాబ్ల లెక్కలను పరిశీలించారు. ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు ఇవ్వనుంది. ఆ తర్వాత లబ్ధిదారుల సంఖ్యపై స్పష్టత వస్తుంది.
