Tirumala : తిరుమలలో ఇక విగ్రహాలకు హైటెక్ రక్షణ.. టీటీడీ కీలక ప్రకటన.. ఆంజనేయస్వామి విగ్రహం పునఃప్రతిష్ఠ
Anjaneya Swamy idol Re-consecrates At Tirumala : తిరుమలలో చోరీకి గురైన ఏడో మైలు ఆంజనేయస్వామి చిన్న విగ్రహాన్ని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆగమశాస్త్ర సంప్రదాయాల ప్రకారం యథావిధిగా పునఃప్రతిష్ఠ చేసింది.
- Harish Thanniru
- Updated on- July 23, 2026 / 12:32 PM IST
Anjaneya Swamy idol in Tirumala
Anjaneya Swamy idol Re-consecrates At Tirumala : తిరుమలలో చోరీకి గురైన ఏడో మైలు వద్ద ఆంజనేయస్వామి చిన్న విగ్రహాన్ని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆగమశాస్త్ర సంప్రదాయాల ప్రకారం యథావిధిగా పునఃప్రతిష్ఠ చేసింది. ఆగమ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో పుణ్యాహవాచనం, సంప్రోక్షణ నిర్వహించి గురువారం ఉదయం 8.30 గంటలకు విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించారు.
Also Read : Talliki Vandanam : ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు మీ అకౌంట్లో పడలేదా..? వెంటనే ఇలా చేయండి.. ఆలస్యం చేయొద్దు..
ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. బుధవారం ఓ భక్తుడు ఏడో మైలు ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న చిన్న విగ్రహాన్ని చోరీ చేశారని తెలిపారు. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేవలం 14 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నిందితుడి నుంచి చోరీకి గురైన విగ్రహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సంప్రదాయాలను అనుసరించి పుణ్యాహవాచనం, సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠించినట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. కేసును వేగంగా ఛేదించి విగ్రహాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో పోలీసులు చూపిన చొరవ అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఘాట్ రోడ్లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలకు భద్రతను మరింత బలోపేతం చేస్తామని టీటీడీ అదనపు ఈవో స్పష్టం చేశారు. విగ్రహాల వద్ద రక్షణ కోసం ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయడంతోపాటు అధునాతన సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.
