YS Jagan Mohan Reddy : ఈరోజు కడప జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి కడపలో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. ఆకాశంలో క్యుములోనింబస్ మేఘాలు ఆవరించి ఉండటంతో హెలికాప్టర్ ప్రయాణానికి ప్రతికూలంగా మారనున్నాయి.
దీంతో జగన్ రోడ్డు మార్గం ద్వారా పులివెందుల వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే కడప నుంచి పులివెందుల దాకా అడుగుడుగా పోలీసులను మొహరించి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పులివెందుల, వేంపల్లిలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పులివెందుల పట్టణంలో కొన్నిప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, రోప్ పార్టీని సిధ్దంగా ఉంచారు.
ఈరోజు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరిన జగన్ కడప చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గం.11లకు పులివెందుల చేరుకుంటారు. ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి వారి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పులివెందులలోని ఏపీ కార్ల్కు చేరుకొని.. న్యూటెక్ బయోసైన్సెస్కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఐజీ కార్ల్ మీటింగ్లో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి.. మధ్యాహ్నం 3.05 గంటలకు వేంపల్లె చేరుకుంటారు.
మధ్యాహ్నం 3.30 గంటలకు డాక్టర్ వైఎస్సార్ స్మారక పార్కును సీఎం ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు వేంపల్లె జిల్లా పరిషత్ హైస్కూల్కు చేరుకొని భవనాలను ప్రారంభించి.. విద్యార్థులతో ముచ్చటిస్తారు. సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్కు చేరుకుని రాత్రి బస చేస్తారు.
రేపు ఉదయం (శుక్రవారం)గం. 8.05లకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్కు సీఎం జగన్ చేరుకుంటారు. తన తండ్రి, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డికి నివాళులర్పిస్తారు. 8.55 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి 10.10 గంటలకల్లా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం నాగార్జున వర్సిటీ ఎదురుగా జరిగే వైఎస్సార్సీపీ ప్లీనరీలో పాల్గొంటారు.
Also Read : Hayathnagar : హైదరాబాద్ శివారులో దోపిడీ దొంగల బీభత్సం