Amaravati Mini Amazon Forest : అమరావతిలో ’మినీ అమెజాన్ ఫారెస్ట్’.. అందులో ఏమేం ఉంటాయంటే..
Amaravati Mini Amazon Forest : అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయబో మినీ అమెజాన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సుమారు రూ.17 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యమైన అమెజాన్ అడవిని పోలిన సహజ వాతావరణాన్ని సృష్టించడం దీని ప్రధాన లక్ష్యం.
- Harish Thanniru
- Updated on- July 14, 2026 / 02:28 PM IST
AP Government key decision: 'mini Amazon forest' in Amaravati
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- అమరావతిలో మినీ అమెజాన్ ఫారెస్ట్
- సుమారు రూ.17 కోట్లు ఖర్చు చేయనున్న సర్కార్
Amaravati Mini Amazon Forest : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో రాజధాని నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే గొప్ప రాజధానిగా అమరాతిని తీర్చిదిద్దేందుకు కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా.. రాజధాని అమరావతిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో వినూత్న ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టే యోచనలో ఉంది. రూ.17కోట్ల వ్యయంతో నగర నడిబొడ్డున ‘మినీ అమెజాన్ ఫారెస్ట్’ తరహా ఎకో టూరిజం పార్కును అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.. ఈ ప్రాజెక్ట్ అమలైతే అమరావతి పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అమరావతి, విశాఖపట్టణాలను సామాజిక మౌలిక వసతులు, ఐటీ రంగంలో అభివృద్ధి చేస్తూనే పర్యాటక రంగాన్ని కూడా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో అమరావతిలో ప్రత్యేకమైన మినీ అమెజాన్ ఫారెస్ట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు చేస్తునట్లు సమాచారం. అమరావతిలో 300 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న శాఖమూరు పార్కులో దట్టమైన అడవిలో విహరించినట్లు అనుభూతి కలిగేలా ఐదెకరాల్లో మినీ అమెజాన్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో 20వేల చెట్లు, వివిధ రకాల మొక్కలు, చిన్న సహజ ఆవాసాలు ఏర్పాటు చేసి అమెజాన్ అడవిని తలపించేలా రూపకల్పన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దట్టమైన అడవితోపాటు ఒక కృత్రిమ రెయిన్ ఫారెస్ట్ ను సృష్టించేందుకు కూటమి సర్కార్ సిద్ధమవుతోంది.
అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయబో మినీ అమెజాన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సుమారు రూ.17 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యమైన అమెజాన్ అడవిని పోలిన సహజ వాతావరణాన్ని సృష్టించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను ఆకర్షించే ఎకో టూరిజం కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. అయితే, ఇలాంటి ప్రాజెక్టును నిర్మించడం మాత్రమే కాకుండా, దీర్ఘకాలం పాటు నిర్వహించడం కూడా ప్రభుత్వానికి సవాల్గా మారే అవకాశం ఉంది. చెట్ల సంరక్షణ, సహజ వాతావరణం కొనసాగించడం, నిర్వహణ ఖర్చులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
ఈ ప్రాజెక్టు విజయవంతంగా అమలైతే ప్రతి ఏడాది వేలాది మంది ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు అమరావతిని సందర్శించే అవకాశం ఉంది. రాజధానిగా మాత్రమే కాకుండా, పర్యాటక కేంద్రంగా కూడా అమరావతికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
ప్రధాన విశేషాలు..
♦ 20వేలకుపైగా చెట్లు, మొక్కలు
♦ 400 రకాల వృక్ష జాతులు
♦ మియావాకీ విధానంలో దట్టమైన అడవి
♦ కృత్రిమ జలపాతాలు, సెలయేళ్లు, తటాకాలు
♦ రెయిన్ గన్స్ తో ఎప్పుడూ చినుకుల అనుభూతి
♦ మిస్ట్ గార్డెన్ అండ్ రెయిన్ వాక్వే
♦ బయటి వాతావరనం కంటే 3-4 డిగ్రీల సెల్సియస్ చల్లగా ఉండే ప్రత్యేక రూపకల్పన
♦ విద్యార్థులు, పరిశోధకుల కోసం విజ్ఞాన కేంద్రం
