Agrigold
AgriGold Depositors : అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం మంగళవారం(ఆగస్టు 24, 2021) డబ్బులు జమ చేయనుంది. రూ.10వేల లోపు డిపాజిట్ చేసిన వారికి రూ.207.16 కోట్లు, రూ.20వేలలోపు డిపాజిట్ చేసిన వారి ఖాతాల్లో రూ.459.23 కోట్లు కలిపి 7 లక్షల మందికిపైగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం చెల్లింపులు చేయనుంది. ఈ మేరకు మొత్తంగా రూ.666.84 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ నెల 19 వరకూ 7.76 లక్షల మంది డిపాజిట్దారులు దరఖాస్తు చేసుకున్నారు. రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి ఇప్పటికే రూ.240 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. 67 ఎకరాల అగ్రిగోల్డ్ స్థలాన్ని కోర్టుకు స్వాధీనం చేసింది. పాదయాత్ర సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాటకు కట్టుబడి బాధితుల ఖాతాల్లో నగదు జమ చేస్తూ సీఎం జగన్ ఆదుకుంటున్నారని వైసీపీ నేతలు చెప్పారు. ప్రైవేట్ సంస్ధ మూసేస్తే బాధితులకి ప్రభుత్వం న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవన్నారు.
అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని సీఎం జగన్ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు పలు విడుతల్లో చెల్లింపులు చేశారు. కాగా, బాధితుల సమస్యల పరిష్కారానికి 1800 4253 875 టోల్ఫ్రీ నెంబర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.