×
Ad

ఏపీ ప్రభుత్వం సంచలనం.. చెవిరెడ్డి, ఫ్యామిలీ ఆస్తులు అటాచ్..

AP liquor scam : ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు‌నకు

liquor scam

AP liquor scam : ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈ కేసులో కీలక నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్ మెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

మద్యం కుంభకోణంతో చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీగా విలువైన అస్తులు కూడబెట్టినట్లు సిట్ గుర్తించింది. చెవిరెడ్డి కుటుంబం కమీషన్లు, కిక్ బ్యాక్ లు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ తేల్చింది. సిట్ దర్యాప్తు నివేదిక, విన్నపం మేరకు చెవిరెడ్డి ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలుజారీ చేసింది.

చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల అటాచ్ మెంట్ కు ప్రభుత్వం ఆదేశించింది. కెవీఎస్ ఇన్‌ఫ్రా ఎండీ‌గా ఉన్న మోహిత్ రెడ్డి భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మి పేరిట ఆస్తులతోపాటు.. సీఎంఆర్ ఇన్‌ఫ్రా పేరిట చెవిరెడ్డి మరో కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తులను అటాచ్‌మెంట్ చేయనున్నారు.

మద్యం కుంభకోణం అక్రమాలతో చెవిరెడ్డి కుటుంబం 63. 72 కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టారని సిట్ తేల్చింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల విలువను కేవలం 8 కోట్ల 85 లక్షల 47 వేల 693 గా తగ్గించారని, 54కోట్ల 87లక్షల17 వేల 107 కంటే ఎక్కువ మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని సిట్ అధికారులు తేల్చారు. చెవిరెడ్డి కుటుంబం 54.87 కోట్ల పైగా మొత్తాన్ని లెక్కల్లో చూపకుండా బ్లాక్ మనీగా మలచినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్, తొట్టంబేడు జాయింట్ రిజిస్ట్రార్ల వద్ద రిజస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు.

నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల వద్ద రిజిస్ట్రరైన ఆస్తుల ఆటాచ్ మెంట్ కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. చిత్తూరు జిల్లా పుత్తూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చెవిరెడ్డి కుటుంబం పేర్లతో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెవిరెడ్డి కుటుంబం మోసపూరిత భూ లావాదేవీలు భారీగా చేసినట్లు సిట్ నిర్దారణకు వచ్చింది. వెండోడులోని అరబిందో ఫార్మాకు KVSఇన్‌ఫ్రా ద్వారా 263.28 ఎకరాల భూమి కొనుగోలు, అమ్మకంలో మోసం జరిగినట్లు సిట్ గుర్తించింది.

తక్కువ సమయంలోనే భూమి విలువలను అసాధారణంగా పెంచి నల్లధనాన్ని తెల్లగా మార్చారని సిట్ తన నివేదికలో పేర్కొంది. ఈ లావాదేవీ ద్వారానే కేవీఎస్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ 13.3 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారని సిట్ తేల్చింది. మద్యం కుంభకోణం నుండి కమీషన్లు, కిక్ బ్యాక్‌లతో చెవిరెడ్డి కుటుంబం భారీగా స్థిర, చర ఆస్తులు కూడబెట్టారని, అవినీతి నిరోధక చట్టం, , క్రిమినల్ లాలోని పలు సెక్షన్ల ప్రకారం అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని ప్రభుత్వాన్ని సిట్ అధికారులు కోరారు. దీంతో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు విజయవాడ కోర్టులో దరఖాస్తు చేసేందుకు అనుమతిస్తూ ఆదేశాలిచ్చిన ప్రభుత్వం.. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది.  ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.