Minister Ushashri Charan : ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఏపీలో ప్రలోభాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరుగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో మంత్రి ఉషశ్రీ చరణ్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తున్న విషయంపై డిస్కషన్ జరుగుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. పార్టీ నాయకులు, అనుచరులతో మంత్రి ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియోలో.. ఒక్కో పోలింగ్ స్టేషన్ లో ఎన్ని ఓట్లు, ఎంత ఇచ్చారంటూ చర్చ జరిగినట్లుగా ఉంది.
కాగా, సొంత పార్టీ నేతలే వీడియోని బయటకు పంపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో ఆధారంగా విపక్షాలు మంత్రి ఉషశ్రీ చరణ్ ను టార్గెట్ చేశాయి. ఉషశ్రీచరణ్ పై కల్యాణదుర్గం ఆర్డీవోకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశాయి.
కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్.. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న జాబితా పరిశీలిస్తూ సమీక్ష నిర్వహించినట్లుగా ఆ వీడియో ఉండటం వివాదానికి దారితీసింది. మంత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని టీడీపీ నేతలు అస్త్రంగా మలుచుకుని మంత్రిపై దాడికి దిగారు. కల్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు వెంటనే కల్యాణదుర్గం ఆర్డీవో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దీనిపై ఫిర్యాదు చేశారు. వీడియో ఆధారంగా మంత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఉషశ్రీ చరణ్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.