AP Opposition Leaders : పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ఏపీ రాష్ట్ర విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పనులను వేగవంతం చేయాలని అన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసేలా అందరూ కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, ప్రభుత్వాల నిర్లక్ష్యాలపై సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర శ్రీనివాసరావు, మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, నరహరశెట్టి నరసింహారావు, బాలకోటయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల పనులు పూర్తిగా నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు.
Perni Nani: నాదెండ్ల మనోహర్ మాట తప్ప వారిమాట వినవా? పవన్పై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
కర్నాటక ఎన్నికలలో బీజేపీ నేతలంతా కలిసి పర్యటించినా ప్రజలు ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారని పేర్కొన్నారు. సీఎం జగన్ ఇప్పుడైనా నోరు విప్పాలని.. ధైర్యంగా సమస్యలపై స్పందించాలని సూచించారు. కేంద్రం వద్దకు వెళ్లి పోలవరం, ఇతర సమస్యలపై స్పష్టంగా చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని చెప్పారు.
ఎంపీలతో చట్ట సభలలో ఒత్తిడి తెచ్చేలా చూడాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందన్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలతోనైనా జగన్ మేల్కోవాలని సూచించారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసేలా అందరూ కలిసి పోరాటం చేయాలని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ పోలవరం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందన్నారు.
ఈ విషయం తెలిసినా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అనేక సార్లు డిమాండ్లు చేసినా, అడిగినా స్పందన లేదని చెప్పారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి.. అమలు చేయడం లేదన్నారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం పూర్తి బాధ్యత తీసుకుని పోలవరం పూర్తి చేయాలని కోరారు. జగన్ కూడా బాధ్యత తీసుకుని పోలవరం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.