Ap Rains: చల్లబడిన ఆంధ్రప్రదేశ్.. ఐదు రోజులు దంచికొట్టనున్న వానలు.. వాతావరం శాఖ హెచ్చరికలు
నైరుతి రుతుపవనాలు సైతం చురుగ్గా(Ap Rains) కదులుతుండటంతో వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
- V Santhosh Kumar
- Published on- July 3, 2026 / 06:46 AM IST
Meteorological Department has warned of the possibility of heavy rains in AP for five days
- బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం
- ఐదు రోజులు భారీ వర్షాలు
- జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరిక
Ap Rains: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని కొత్తగా ఏర్పడుతున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు సైతం చురుగ్గా కదులుతుండటంతో వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రాలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం తదితర జిల్లాల్లో ఇప్పటికే ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. ఈ ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములు మరియు బలమైన ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ప్రారంభమయ్యాయి. శనివారం నుండి వర్షాల(Ap Rains) తీవ్రత మరింత పెరిగి, మిగిలిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని, పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
