Ap Corona Cases
AP Omicron : యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఏపీని కూడా కలవరపెడుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం(జనవరి 4) ఒక్కరోజే రాష్ట్రంలో ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి పెరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది.
Corona New Variant IHU : కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే డేంజర్…?
ఒమిక్రాన్ సోకిన వారిలో ఒమన్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు, దుబాయ్ నుంచి ఇద్దరు, అమెరికా, సుడాన్, గోవా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో ముగ్గురు కృష్ణా జిల్లా వాసులు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు చొప్పున ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
కొత్తగా ఒమిక్రాన్ సోకిన ఏడుగురితో కాంటాక్ట్ అయిన అందర్నీ గుర్తించామని.. వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ జీనోమ్ టెస్టింగ్కు పంపించినట్లు వివరించింది. ఇక, ఒమిక్రాన్ సోకిన ఏడుగురిలో ఒకరికి కొద్ది పాటి లక్షణాలు ఉండటంతో అతడిని ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్చామని.. మిగిలిన వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. వీరందర్నీ ఐసోలేషన్లో ఉంచినట్లు వెల్లడించింది.
Pani Puri : స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీ ఆరోగ్యానికి మంచిదేనా?
ఒమిక్రాన్ సోకిన వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 31 ఏళ్ల మహిళ డిసెంబర్ 19న ఒమన్ నుంచి వచ్చింది.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి డిసెంబర్ 25న యూఏఈ నుంచి వచ్చాడు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 37 మహిళ ఒమన్ దేశం నుంచి డిసెంబర్ 23న వచ్చింది.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 46 ఏళ్ల వ్యక్తి డిసెంబర్ 29న యూఏఈ నుంచి వచ్చాడు.
కృష్ణా జిల్లాకు చెందిన 54 ఏళ్ల వ్యక్తి డిసెంబర్ 28న యూఏఈ నుంచి వచ్చాడు.
కృష్ణా జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువకుడు డిసెంబర్ 23న సౌత్ సూడాన్ నుంచి వచ్చాడు.
కృష్ణా జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువకుడు డిసెంబర్ 20న గోవా రాష్ట్రం (ఇతనికి అంతర్జాతీయ ట్రావెలింగ్ హిస్టరీ లేదు) నుంచి వచ్చాడు.
మరోవైపు కరోనా కొత్త కేసులు కూడా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 28వేల 311 పరీక్షలు నిర్వహించగా.. 334 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 20,77,942కు చేరాయి. కొవిడ్ తో నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటివరకు కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,499కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 95 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,61,927 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,516 యాక్టివ్ కేసులున్నాయి.