vahana mitra scheme
Auto Mitra Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 2025-26 సంవత్సరానికి వాహనమిత్ర పథకం కింద రూ.15వేలు ఆర్థిక సహాయం చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలనుసైతం జారీ చేసింది. ఈ పథకంకు అర్హత కలిగిన కొత్తవారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
2023-24లో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విశ్లేషిస్తారు. కొత్త అప్లికేషన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. బుధవారం (సెప్టెంబర్ 17) నుంచి గ్రామ, వార్డు సచివాలయాల విభాగంలో దరఖాస్తుల స్వీకరణకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 19వ తేదీలోపు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫారంలో పొందుపర్చాల్సిన వివరాలు..
దరఖాస్తుదారుని పేరు, తండ్రి పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, కులం – ఉపకులం, కుల ధృవీకరణ పత్రం నెంబర్, బ్యాంకు వివరాలు (అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్రాంచ్ పేరు), ఆధాయ ధృవీకరణ పత్రం నంబరు, ఆదాయం, చిరునామా, వాహన రకం (ఆటో లేదా ట్యాక్సీ లేదా మ్యాక్సీ క్యాబ్), వాహన గుర్తింపు సంఖ్య, చెల్లుబాటు అయ్యే తేదీ, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, జారీ చేసిన తేదీ మరియు కార్యాలయం వంటి వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి.
ధరఖాస్తు చివరిలో.. దరఖాస్తు ఫారంలో పేర్కొన్న వివరాలన్నీ పూర్తిగా వాస్తవం అని తెలియజేస్తూ, తనిఖీ సమయంలో కానీ, ఆ తరువాత కానీ ఏదైనా అవాస్తవం అని తెలిస్తే మీరు తీసుకొనే చట్టపరమైన చర్యలకు బద్దుడనై ఉంటానని తెలియజేస్తున్నాను అని డిక్లరేషన్ ఇవ్వాలి.
వెరిఫికేషన్ ఎప్పుడంటే..
పూర్తి వివరాలతో అప్లికేషన్ పూర్తిచేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాల్సి ఉంది. ఈనెల 22లోపు ఫీల్డ్ వెరిఫికేషన్లు పూర్తి చేస్తారు. తుది జాబితా సెప్టెంబర్ 24వ తేదీ నాటికి సిద్ధం చేసే అవకాశం ఉంది. ఆ తరువాత కార్పొరేషన్ల వారీగా లబ్ధిదారుల జాబితాను జీఎస్డబ్ల్యూఎస్ విభాగం రవాణా శాఖకు పంపుతుంది. అక్టోబర్ 1వ తేదీన డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో ప్రభుత్వం చేయనుంది.
పథకానికి అర్హతలు ఇవే..
♦ ఏపీలో జారీ చేసిన ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సును దరఖాస్తుదారులు కలిగి ఉండాలి.
♦ ఒకవేళ ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా 2025 -26 సంవత్సరానికి అనుమతిస్తారు. అయితే, ఒక నెలలోపు ఆ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
♦ వాహనం ఏపీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి.
♦ దరఖాస్తు దారులు దారిద్ర్య రేఖకు దిగువన (బీపీఎల్) ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉండాలి.
♦ దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్ గా ఉంటే అనర్హులు. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది.
♦ ఇంటి విద్యుత్తు వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. దరఖాస్తు తేదీకి ముందు 12నెలల సగటు లెక్కిస్తారు.
♦ వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు.
♦ మాగాణి అయితే మూడు ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి.
♦ పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస, వాణిజ్య నిర్మాణం ఉండకూడదు.