Vizag Mayor post: విశాఖ పీఠం ఫైట్.. కార్పొరేటర్లకు బంపర్‌ ఆఫర్

ఈ పరిణామాలతో విశాఖ రాజకీయాలు హీటెక్కాయి. కూటమి అవిశ్వాస తీర్మానం విజయవంతమైతే, వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తప్పేలా లేదు.

గ్రేటర్‌ విశాఖ పీఠం ఫైట్‌ పీక్స్‌కు చేరుకుంది. మేయర్‌ పీఠం కోసం కూటమి, వైసీపీ నేతలు వేగంగా పావులు కుదుపుతున్నారు. క్యాంప్‌ పాలిటిక్స్‌లో స్పీడ్‌ పెంచారు. వైసీపీ కార్పొరేటర్లను బెంగళూరుకు తరలిస్తే.. కూటమి కార్పొరేటర్లను ఏకంగా దేశం బార్డర్‌ దాటించేస్తున్నారు. అసలు గ్రేటర్ విశాఖలో ఏం జరుగుతోంది. లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ

విశాఖ మేయర్ పీఠం కోసం కూటమి, వైసీపీ మధ్య ఫైట్‌ రోజురోజుకు తీవ్రమవుతోంది. పీఠాన్ని కాపాడుకోవడానికి వైసీపీ, మేయర్ సీటు కోసం కూటమి తెగ ట్రై చేస్తున్నారు. ఏ వర్గం ఎక్కడా తగ్గడం లేదు. ఎవరికి వారు ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. కూటమి నాయకులు ప్రస్తుత మేయర్ హరి వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి.. పదవిని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.

నిజానికి కూటమి అధికారంలోకి రాగానే.. మేయర్ హరి వెంకట కుమారికి పదవీ గండం తప్పదనే ప్రచారం జరిగింది. ఐతే సవరించిన మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం నాలుగేళ్ల గడువు పూర్తి కావాలి. ఇప్పుడు ఆ టైమ్ మార్చి 18తో ముగిసింది. దీంతో కూటమి పార్టీలు.. ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ మొదలుపెట్టేశారు. అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కూటమి నాయకులు కలెక్టర్‌ను కలిసి నోటీసు ఇచ్చారు.

అవిశ్వాస తీర్మానంపై నోటీసులో సంతకాలు చేసిన కార్పొరేటర్లకు కలెక్టర్ నుంచి లేఖలు అందాలి. వారు సమ్మతిస్తే.. సంతకాలను మారోసారి పరిశీలించి మేయర్‌పై అవిశ్వాసం పెట్టడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు సమయం పట్టే అవకాశముంది. దీంతో కూటమి పార్టీలు క్యాంప్‌ రాజకీయాలను నమ్ముకున్నారు. కూటమి కార్పొరేటర్లతో పాటు కూటమికి మద్దతు తెలుపుతున్న కార్పొరేటర్లను ఏకంగా దేశం దాటించాడాని డిసైడ్ అయ్యారు. వీరందరిని మలేసియా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే కార్పొరేటర్లు.. టీడీపీ ఫ్లోర్ లీడర్‌కు పాస్‌పోర్టులు ఇచ్చేశారట.

కార్పొరేటర్లతో సమావేశాలు
ఇటు వైసీపీ కూడా మేయర్ పీఠం కాపాడుకునేందుకు వెనక్కి తగ్గడం లేదు. పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లతో సమావేశాలు నిర్వహించారు. కూటమి ఆకర్షణలకు లొంగకుండా తమ వారిని కాపాడుకోవడానికి వైసీపీ క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది.

ఇప్పటికే 36 మంది కార్పొరేటర్లను కుటుంబ సమేతంగా బెంగళూరు, ఊటీకి తరలించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 5లోపు అవిశ్వాస తీర్మానం జరిగే అవకాశముంది. కనీసం 10 రోజుల పాటు కార్పొరేటర్లను క్యాంపుల్లోనే ఉంచాలని వైసీపీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ వ్యూహంతో కూటమికి అవసరమైన సంఖ్యాబలం దక్కకుండా చేయాలని చూస్తోంది వైసీపీ. ఈ రెండు వర్గాల వ్యూహాలతో విశాఖ రాజకీయాలు హడావిడిగా మారాయి.

జీవీఎంసీలో మొత్తం కార్పొరేట‌ర్ల సంఖ్య 98. గ్రేటర్‌ పీఠం దక్కాలంటే 74మంది మద్దతు అవసరం. 2001 ఎన్నిక‌ల్లో 59 స్థానాల్లో వైసీపీ, 29 స్థానాల్లో టీడీపీ కార్పొరేట‌ర్లు గెలిచారు. మిగిలిన వాటిలో ఇండిపెండెంట్లు న‌లుగురు, జ‌న‌సేన నుంచి ముగ్గురు విజయం సాధించారు.

ఐతే కూటమి అధికారంలోకి వచ్చాక నంబర్ మారిపోయింది. 20మంది వ‌ర‌కు వైసీపీ కార్పొరేట‌ర్లు టీడీపీ, జ‌న‌సేన కూట‌మిలోకి జంప్ అయ్యారు. దీంతో జీవీఎంసీలో కూట‌మి బ‌లం 53కి పెర‌గ్గా.. వైసీపీ బ‌లం 38కి ప‌డిపోయింది. దీనికి తోడు మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు సైతం కూటమికి జైకొట్టేందుకు రెడీ అవుతున్నారట.

ఈ పరిణామాలతో విశాఖ రాజకీయాలు హీటెక్కాయి. కూటమి అవిశ్వాస తీర్మానం విజయవంతమైతే, వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తప్పేలా లేదు. రాష్ట్రంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌పై కూటమి పట్టు సాధిస్తుంది. మరోవైపు, వైసీపీ తన వ్యూహంతో అవిశ్వాసాన్ని విఫలం చేస్తే, కూటమికి ఇది రాజకీయంగా చేదు అనుభవం అవుతుంది. ప్రస్తుతం రెండు వర్గాలు కార్పొరేటర్లను కాపాడుకోవడానికి, ఆకర్షించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పోరులో ఎవరు గెలుస్తారనేది త్వరలోనే తేలనుంది.