Visakhapatnam YCP : గ్రేటర్ విశాఖలో ఫ్యాన్‌ స్పీడ్‌ను పెంచేదెవరు.? మేయర్ సీటు దక్కేదెలా..

Visakhapatnam YCP Politics : గ్రేటర్‌ విశాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఫ్యాన్ పార్టీకి ఛాలెంజింగ్‌గా మారాయని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న వేళ..గ్రేటర్ విశాఖ మేయర్ సీటు దక్కేదెలా.? అన్నింటికి మించి ప్రత్యక్ష ఎన్నికల్లో పరువు నిలబెట్టుకునేదెలా.? అని వైసీపీ ఇంటర్నల్‌గా తెగ కసరత్తు చేస్తున్నట్లు టాక్.

Visakhapatnam YCP Politics

Visakhapatnam YCP Politics : స్థానిక పోరు ఏపీలో పొలిటికల్ హీట్‌ను..క్యూరియాసిటీని అంతకంతకు పెంచేస్తోంది. మున్సిపోల్స్‌పై కూటమి పార్టీలు ఎవరి లెక్కల్లో వారుగా బిజీగా అయిపోయాయి. అభ్యర్థుల ఎంపిక..రిజర్వేషన్లు, గెలుపోటములపై రిపోర్టులు తెప్పించుకుంటున్నాయట కూటమి పార్టీలు. విపక్ష పార్టీ వైసీపీ కూడా సన్నాహకాల్లో బిజీగా ఉంది. ముఖ్యంగా గ్రేటర్‌ విశాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఫ్యాన్ పార్టీకి ఛాలెంజింగ్‌గా మారాయని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న వేళ..గ్రేటర్ విశాఖ మేయర్ సీటు దక్కేదెలా.? అన్నింటికి మించి ప్రత్యక్ష ఎన్నికల్లో పరువు నిలబెట్టుకునేదెలా.? అని వైసీపీ ఇంటర్నల్‌గా తెగ కసరత్తు చేస్తున్నట్లు టాక్.

Also Read : Sonia Gandhi Autobiography : సోనియా బుక్ వివాదం.. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల వార్.. ఇంతకీ ఆత్మకథలో ఏముంది?

2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విశాఖ మేయర్‌ పీఠాన్ని స్వాధీనం చేసుకుంది. మొత్తం 98 కార్పొరేషన్ సీట్లలో 58 చోట్ల గెలిచి మేయర్‌ సీటును గెలుచుకుంది. ఈ సారి 98 కార్పొరేటర్ స్థానాలు..125కు పెరిగే అవకాశం ఉంది. ఆ 125 డివిజిన్లకు అభ్యర్థులను ఎంపిక చేయడమే కాదు..మేయర్‌ సీటు కోసం డైరెక్ట్‌ ఎలక్షన్‌లో తలపడటం వైసీపీకి సవాల్‌గానే కనిపిస్తోందట. ఏపీ నగర పాలక సంస్థల్లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అతిపెద్దది కావడం..విశాఖతో పాటు అనకాపల్లి జిల్లాలో గ్రేటర్ పరిధి విస్తరించి ఉండటం..ఈ సారి ప్రత్యక్ష ఎన్నికలు జరగబోతుండటంతో ..వైసీపీకి తర్జనభర్జన పడుతోందట. 2021లో పార్టీకి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండేవి. మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అప్పుడు గ్రేటర్ విశాఖ ఎన్నిక‌ల‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేశారు. ఒకానొక టైమ్‌లో ఆయ‌న పాద‌యాత్ర కూడా చేశారు. 2019లో వైసీపీ హ‌వా కొన‌సాగినప్పటికీ..విశాఖ ప‌రిధిలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలను టీడీపీనే ద‌క్కించుకుంది. ఆ ఎఫెక్ట్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పై ప‌డుతుంద‌ని అలర్ట్ అయి..దాదాపు నాలుగు నెలలు చెమటోడ్చారు సాయిరెడ్డి.

క‌ట్ చేస్తే..మ‌రో రెండు నెలల్లో విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో సాయిరెడ్డిలాగా దూకుడుగా వ్యవ‌హ‌రించేవారు ఎవ‌ర‌న్నది బిగ్ క్వశ్చన్‌గా మారింది. ఇప్పుడు సాయిరెడ్డి వైసీపీకి దూరంగా ఉన్నారు. దీంతో ఆయ‌న ప్లేస్‌ను కొన్నాళ్ల పాటు వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. విమ‌ర్శలు..అంత‌ర్గత అసంతృప్తి పెరిగిపోవడంతో వైవీ సుబ్బారెడ్డిని కూడా త‌ప్పించారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కుర‌సాల క‌న్నబాబు ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. అయితే..ఆయ‌న ఎక్కడా దూకుడు ప్రద‌ర్శించ‌డం లేదట. అంతేకాదు..నేతల మ‌ధ్య సయోధ్య కుదిర్చే ప్రయ‌త్నం కూడా చేయ‌డం లేదంటున్నారు. దీంతో గ్రేటర్ విశాఖలో సాయిరెడ్డి వైసీపీకి తీసుకొచ్చిన ఇమేజ్‌ను నిలబెట్టేదెవరన్న టాక్ వినిపిస్తోంది.

మండలిలో ప్రతిపక్ష నేత, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో బలమైన నేతగా ఉన్నప్పటికీ ఆయన విశాఖపై దృష్టి పెట్టే పరిస్థితి లేదంటున్నారు. బొత్స విజయనగరం జిల్లా వ్యవహారాలకే పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. తన కూతురు అనూషను విజయనగరం జడ్పీ ఛైర్మన్‌గా గెలిపించుకొని సత్తా చాటే ఆలోచనలో ఉన్నారట బొత్స. వైసీపీ నుంచి ఇద్దరు ముగ్గురు మాజీల పేర్లు కూడా మేయర్‌ రేస్‌లో తెర మీదికి వచ్చాయి. పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఆదేశిస్తే సిద్ధం అంటూ సంకేతాలు ఇచ్చారు రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్. మరో మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ అయితే ఎలా ఉంటుందన్న చర్చ కూడా పార్టీలో ఉందట. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ మేయర్ పీఠాన్ని వైసీపీ తిరిగి నిలబెట్టుకుందా.? చేజార్చుకుంటుందా.? అనేది ఉత్కంఠ రేపుతోంది.

మరోవైపు విశాఖ‌ సెంట్రిక్‌గా ఉత్తరాంధ్రలో డెవలప్‌మెంట్‌ యాక్టివిటీతో జనాలకు మరింత దగ్గరయ్యేలా పావులు కదుపుతోంది కూటమి. గూగుల్ డేటా సెంటర్..ఐటీ ప‌రిశ్రమ‌లు, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ స‌హా..విశాఖకు ఎన్నో పరిశ్రమలు, పెట్టుబ‌డులు తీసుకొస్తోంది. ఇవ‌న్నీ టీడీపీ గ్రాఫ్‌ను పెంచాయని..మొన్నటి 2024 ఎన్నికల కంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూటమికి జనాల మద్దతు పెరిగినట్లు సర్వేలు అంచనా వేస్తున్నాయట. దీనికి తోడు ఎంపీ భ‌ర‌త్, ఎమ్మెల్యేల మ‌ధ్య సానుకూల రాజ‌కీయాలు ప్లస్‌ పాయింట్‌గా మారబోతున్నాయట.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావు సొంత నియోజ‌క‌వ‌ర్గం కూడా విశాఖ గ్రేటర్ పరిధిలోనే ఉండటంతో..నేతలంతా కలిసికట్టుగా పనిచేసేలా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారట. 2021లో ఉన్న పరిస్థితులు అప్పుడు వైసీపీకి అనుకూలిస్తే..ఇప్పుడు వార్‌ వన్‌సైడే అని టీడీపీ హోప్స్‌ పెట్టుకుంది. వైసీపీ సునామీని సృష్టించి విశాఖ మేయర్ పీఠాన్ని తిరిగి నిలబెట్టుకుంటుందా.? కూటమి దూకుడు ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో వైసీపీ నిలబడగలదా.? టీడీపీ పవర్‌లో ఉంది కాబట్టి విశాఖ కార్పొరేషన్‌పై పట్టు సాధిస్తుందా.? అన్నది రాబోయే ఎన్నికల్లో తేలనుంది.