బీజేపీ ఏకపక్ష నిర్ణయాలపై దేశవ్యాప్త పోరాటాలకు సిద్ధమవుతున్నాం- వైఎస్ షర్మిల

మైనారిటీల మనోభావాలను బీజేపీ దెబ్బతీసింది. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ మీద బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది.

Ys Sharmila : భారత రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవించడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. బీజేపీ ఏకపక్ష నిర్ణయాలపై దేశవ్యాప్త పోరాటాలకు సిద్ధం అవుతున్నామని షర్మిల తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అభిప్రాయాలను గౌరవించే సంప్రదాయం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉందని ఆమె స్పష్టం చేశారు.

”ఏఐసీసీ ఆఫీస్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీలు, పీసీసీలు, ఇంఛార్జ్ లతో మీటింగ్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చ జరిగింది. దేశవ్యాప్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్ లో బీజేపీ అనుసరించిన వైఖరి మీద చర్చ జరిగింది. సవివరంగా, ప్రజాస్వామ్యబద్దంగా అందరి అభిప్రాయాలను గౌరవించే సంప్రదాయం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. బీజేపీ ఏకపక్ష నిర్ణయాలపై దేశ వ్యాప్త పోరాటాలకు సిద్ధం అవుతున్నాం.

మైనారిటీల మనోభావాలతో బీజేపీ ఆడుకుంటోంది. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ మీద బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది. వక్ఫ్ చట్ట సవరణ మైనార్టీల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. భారత రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవించడం లేదు. సెబీ, ఆదానీ అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. సెబీని తన గుప్పెట్లో పెట్టుకుని ఆదానీని కాపాడుతున్నారు. కులగణనపై కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి పోరాటాలు చేయబోతోంది. కులగణన అంశంపై పార్లమెంట్ లో కాంగ్రెస్ లేవనెత్తింది.

అవినీతిరహిత పాలన అంటూ బీజేపీ గొప్పలు చెబుతుంది. కానీ ఆదానీ-మోడీల అవినీతిని రాహుల్ గాంధీ ఎప్పుడో ఎండగట్టారు. ఆదానీ..మోడీ గ్రూప్, ఆదానీ.. మోడీ బినామీ. ఆదానీని కాపాడే విషయంలో మోడీ చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతాం. బీజేపీ అవినీతిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే కార్యాచరణ ఉండబోతుంది” అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి తెలిపారు.

Also Read : అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం.. పూర్తి వివరాలు తెలిపిన ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత

ట్రెండింగ్ వార్తలు