Nara Lokesh : ఎన్నికల వేళ వైసీపీకి టీడీపీ బిగ్ షాక్..! పీకేను దూరం చేసిన నారా లోకేశ్

చంద్రబాబు జైల్లో ఉండగా న్యాయవాదులతో చర్చించాలని ఢిల్లీ వెళ్లిన లోకేశ్ రెండో కంటికి తెలియకుండా పావులు కదిపి పీకేను తమతో కలిసి పని చేయడానికి ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఇక పీకే, టీడీపీ కలిసి పని చేయనున్నారని గతంలోనే 10టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది.

వ్యూహం సినిమా రిలీజ్ కు ముందే టీడీపీ ప్రతివ్యూహం అమలు చేసింది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) ను తనవైపు తిప్పుకుంది. మూడు నెలల క్రితమే పీకే, టీడీపీ మధ్య బంధం బలపడుతున్నా.. పసిగట్టలేకపోయింది వైసీపీ. అకస్మాత్తుగా పీకే విజయవాడలో ప్రత్యక్షం కావడంతో ప్రతిదాడి తీవ్రం చేసింది.

ఉరుము లేని మెరుపులా విజయవాడలో ప్రత్యక్షమైన పీకే..
ట్విస్టుల మీద ట్విస్టులు ఏపీ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నాయి. ఎన్నికల వ్యూహాల్లో దిట్టగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే సడెన్ గా సీఎం జగన్ కు ఝలక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీని విజయతీరాలకు చేర్చిన పీకే.. ఉరుము లేని మెరుపులా విజయవాడలో ప్రత్యక్షమై వైసీపీకి షాక్ ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో టీడీపీకి టచ్ లోకి వచ్చిన పీకే అధికార వైసీపీకి హ్యాండ్ ఇచ్చి తెలుగుదేశంతో చేతులు కలిపారు.

ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన వ్యక్తిగా గుర్తింపు..
2014 నుంచి ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన వ్యక్తిగా దేశంలోనే గుర్తింపు పొందిన పీకే అప్పటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేయించి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా బీహార్, ఏపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జేడీయూ, వైసీపీ, తృణమూల్, డీఎంకే పార్టీల విజయానికి కృషి చేశారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, బీఆర్ఎస్ కు అనుబంధంగా పని చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్.. ఎన్నికలకు ముందే పీకే సేవలకు దూరమవగా ఏపీలో వైసీపీ ఇప్పటికీ ఐప్యాక్ సేవను వాడుకుంటోంది. అయితే ఐప్యాక్ తో సంబంధాలు తెంచుకున్న ప్రశాంత్ కిశోర్ రాజకీయాలపై ఆసక్తితో సొంత రాష్ట్రం బీహార్ పై ఫోకస్ చేశారు.

Also Read : జగన్ సంచలన నిర్ణయాలు.. అసలు వ్యూహం ఏంటి? గెలుపుపై అంత ధీమా ఎలా?

అప్పటి నుంచి జగన్ తో పెరిగిన గ్యాప్..
ఇలా వైసీపీతో బంధం తెంచుకున్న పీకే చాలా కాలంగా తన వృత్తిని వదిలేశారు. పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. అంతేకాకుండా జాతీయ మీడియాలో వివిధ రాష్ట్రాల పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తన మార్క్ విశ్లేషణ పంచుకునే వారు. ఈ క్రమంలోనే గతంలో ఓసారి ఏపీ ఆర్థిక వ్యవస్థపై ఓసారి సంచలన వ్యాఖ్యలు చేశారు పీకే. దీంతో సీఎం జగన్ తో పీకేకి గ్యాప్ మరింత పెరిగిపోయిందంటున్నారు.

చంద్రబాబు అరెస్ట్ సమయంలో లోకేశ్ పక్కా స్కెచ్..
ఈ క్రమంలోనే పీకే, సీఎం జగన్ మధ్య అంతరం ఉన్నట్లు గుర్తించిన టీడీపీ యువనేత నారా లోకేశ్ పక్కాగా పావులు కదిపి వైసీపీకి షాక్ ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఢిల్లీకి వెళ్లిన లోకేశ్ ను పీకే కలిసినట్లు తెలుస్తోంది. బాబును అరెస్ట్ చేసి జగన్ తప్పు చేశారనే భావనతో ఉన్న పీకే.. లోకేశ్ తల్లి భువనేశ్వరిని ప్రజల్లోకి వెళ్లేలా యాత్ర చేయమని సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక పీకే తమ పట్ల సానుకూలంగా ఉన్నట్లు గ్రహించిన లోకేశ్.. తనకున్న పరిచయాలతో వైసీపీకి వ్యతిరేకంగా స్కెచ్ వేసి పీకేను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా, తమతో కలిసి పని చేసేలా ఒప్పించినట్లు సమాచారం.

Also Read : ఆ ముగ్గురు మాత్రమే సేఫ్..! 10మందిపై వేటు ఖాయం..! అనంత వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ టెన్షన్

ఒకటికి రెండుసార్లు ఆలోచించాకే టీడీపీకి సపోర్ట్..
ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉన్న పీకే.. నేరుగా పనిచేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి చివరికి టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మకు సహకరించాలని నిర్ణయిం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇకపై టీడీపీ సోషల్ మీడియాను పీకే పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ వ్యూహకర్తగా ప్రస్తుతం ఉన్న రాబిన్ శర్మ గతంలో పీకేతో కలిసి ఐప్యాక్ లో పని చేశారు. వీరిద్దరితో పాటు ప్రస్తుతం రాబిన్ శర్మతో కలిసి పని చేస్తున్న శంతను సింగ్ కూడా టీడీపీ ప్రచార కార్యక్రమాలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలా అధికార వైసీపీ సోషల్ మీడియా దాడిని తిప్పికొట్టడంలో పటిష్టమైన క్యాంపైనింగ్ చేయడానికి పెద్ద నెట్ వర్క్ నే ఏర్పాటు చేశారు నారా లోకేశ్. ఇదంతా చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడే జరిగిందంటున్నారు.

రెండో కంటికి తెలియకుండా లోకేశ్ పావులు..
చంద్రబాబు జైల్లో ఉండగా న్యాయవాదులతో చర్చించాలని ఢిల్లీ వెళ్లిన లోకేశ్ రెండో కంటికి తెలియకుండా పావులు కదిపి పీకేను తమతో కలిసి పని చేయడానికి ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఇక పీకే, టీడీపీ కలిసి పని చేయనున్నారని గతంలోనే 10టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది.

Also Read : నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేలపై కత్తిరింపుల కత్తి

పీకే ఎంట్రీతో వైసీపీ ఎదురుదాడి..
ఇప్పుడు 10టీవీ కథనాలను నిజం చేస్తూ చంద్రబాబు వద్దకు వచ్చారు పీకే. అయితే, ఇన్నాళ్లు తమతో అనుబంధం కొనసాగించిన ప్రశాంత్ కిశోర్ అనూహ్యంగా ప్లేట్ ఫిరాయించడంపై మండిపడుతోంది వైసీపీ. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్, అమర్నాథ్ వంటి వారు.. ఎంతమంది పీకేలు వచ్చినా వైసీపీని ఏమీ చేయలేరు అని ఎదురుదాడి మొదలుపెట్టారు. ఏది ఏమైనా పీకే వ్యూహాలు ఎలా ఉంటాయో అనుభవపూర్వకంగా తెలిసిన వైసీపీ ప్రతివ్యూహాలకు  పదును పెడుతోంది.

ట్రెండింగ్ వార్తలు