తిరుపతి ఆవిర్భావ వేడుకలను ఈ నెల 24న ఘనంగా నిర్వహిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఇవాళ తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా ఈ వేడుకలను వైభవంగా నిర్వహించుకుంటున్నామన్నారు.
ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది తిరుపతి నగరమని తెలిపారు. గోవిందరాజ పట్నం అంచెలంచెలుగా ఎదిగి తిరుపతి మహానగరమైందని చెప్పారు. మనుషులకు పుట్టిన రోజు తరహాలో ఊరికి పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నామని వివరించారు. నగరమంతా పుట్టినరోజు పండుగ చేసుకుందామని పిలుపునిచ్చారు.
ఫిబ్రవరి 24వ తేదీన గోవిందరాజ స్వామి ఆలయం వద్ద నుంచి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ చేద్దామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా తిరుపతి పుట్టినరోజు వేడుక ఉంటుందని అన్నారు. 894వ పుట్టినరోజు వేడుకలు పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.