Endowment official Shanthi : దేవాదాయశాఖ అధికారిణి శాంతికి బిగ్రిలీఫ్.. మళ్ళీ పోస్టింగ్.. ప్రభుత్వం ఉత్తర్వులు
Endowment official Shanthi : దేవాదాయశాఖ అధికారిణి శాంతికి ఉపశమనం లభించింది. అప్రాధాన్య పోస్టింగ్ ఇవ్వాలని ఎండోమెంట్ ఎక్స్అఫీషియో కార్యదర్శి హరి జవహర్ లాల్ ఆదేశాలు యాజారీ చేశారు.
- Harishth Thanniru
- Published On : March 25, 2026 / 11:28 AM IST
Endowment official Shanthi
- దేవాదాయ శాఖ అధికారిణి శాంతికి ఉపశమనం
- విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు, ఎస్టీ కమిషన్ ఆదేశాలు
- ప్రాధాన్యం లేని పోస్టులో నియమించాలి..
- దేవాదాయ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు
Endowment official Shanthi : ఏపీ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన కళింగిరి శాంతి పలు వివాదాస్పద నిర్ణయాల కారణంగా ‘సస్పెన్షన్కు గురైన విషయం తెలిసిందే. అయితే, ఆమెకు తాజా ఉపశమనం లభించింది. ఆమెపై ఉన్న సస్పెన్షన్ వేటును ఎత్తివేస్తూ, మళ్లీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్రాధాన్య పోస్టింగ్ ఇవ్వాలని ఎండోమెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరి జవహర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితురాలిగా ఉంటూ.. భూ దందాలు, దేవాదాయ ఆస్తుల అక్రమ బదిలీలు పాల్పడినట్లు శాంతిపై ఆరోపణలు వచ్చాయి. వీటిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ చేపట్టింది.
ముఖ్యంగా విశాఖపట్టణంలోని వందల కోట్ల విలువైన భూములను ఆమె అక్రమంగా మళ్లించారని ఆమె భర్త మదన్మోహన్ స్వయంగా మంత్రి నారా లోకేశ్కు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తన బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రి అంటూ ఆయన ఆరోపణలు చేయడంతో వ్యక్తిగతంగా ఆమెను వివాదాల్లోకి నెట్టాయి. ఈ క్రమంలో 2024 జులై2న ఆమెపై సస్పెండ్ వేటు పడింది. విచారణలో భాగంగా ఆమెపై మొత్తం 15కు పైగా అభియోగాలు నమోదయ్యాయి.
శాంతిపై సస్పెన్షన్ వేటువేసి ఏడాది దాటినా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె ఏపీ హైకోర్టును, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన కారణం లేకుండా ఒక ఉద్యోగిని ఏడాది కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్లో ఉంచడం చెల్లదని ఆమె తరపు న్యాయవాదులు వాధించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఆమె సస్పెన్షన్పై పున: సమీక్ష జరపాలని ఫిబ్రవరి 2026లో కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు, ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ ఎత్తివేసి ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో శాంతికి అప్రాధాన్య పోస్టింగ్ ఇవ్వాలని ఎండోమెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరి జవహర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు.
