YS Bhaskar Reddy : వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బిగ్ రిలీఫ్

వివేకా హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ 16న పులివెందులలో అరెస్ట్ చేసి.. YS Bhaskar Reddy

YS Bhaskar Reddy

YS Bhaskar Reddy – YS Viveka Case : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. కోర్టు ఆయనకు ఎస్కార్ బెయిల్ మంజూరు చేసింది. 12 రోజుల పాటు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్య కారణాల దృష్ట్యా 15 రోజులు బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3 వరకు భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. ఎస్కార్ట్‌కు అయ్యే ఖర్చులు భరించాలని భాస్కర్ రెడ్డిని ఆదేశించింది. మంగళవారం ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పు వెలువరిచింది. దీంతో వైఎస్ భాస్కర్ రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి ఎస్కార్ట్ బెయిల్‌పై విడుదల కానున్నారు. బెయిల్ ముగిసిన తర్వాత ఆయన మళ్లీ కోర్టులో లొంగిపోనున్నారు. వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

Also Read..Pawan Kalyan: జనసేనాని డైరెక్షన్‌.. వచ్చే ఎన్నికలకు పవన్ కళ్యాణ్ సరికొత్త రూట్ మ్యాప్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్, మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డి.. అనారోగ్య కారణాలతో తనకు 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటు ఆయన ఆరోగ్య పరిస్ధితిపై చంచల్‌గూడ జైలు అధికారులు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. దీనిని పరిశీలించిన కోర్ట్ సానుకూలంగా స్పందించింది. భాస్కర్ రెడ్డికి 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ 16న పులివెందులలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. 120బీ రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద భాస్కర్ రెడ్డిని సీఐబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివేకాను హతమార్చిన తర్వాత సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడంలో భాస్కర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని సీబీఐ ఆరోపిస్తోంది. వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా ప్రచారం జరగడం వెనుక భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లుగా ఆరోపించారు.

Also Read..Brahmani Nara : చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి..? పార్టీ కష్టాల్లో ఉండటంతో బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధం

నాటి నుంచి చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉంటున్న భాస్కర్ రెడ్డి తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాల్సిందిగా పలుమార్లు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వాటిని కోర్ట్ తిరస్కరిస్తూ వచ్చింది. చివరికి ఎస్కార్ట్ బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.