జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..
తిరుమలకు జగన్ రావడంలో తప్పు లేదు. తిరుమల వచ్చినప్పుడు ఆలయ నిబంధనల ప్రకారం అనమతస్తులు.. ఒక డిక్లరేషన్ ఇవ్వాలి.
- Naveen
- Published On : September 27, 2024 / 06:33 PM IST
Raghunandan Rao Slams Ys Jagan
Raghunandan Rao Madhavaneni : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దుపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. జగన్ పై మాటల యుద్ధానికి దిగారు. జగన్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రినే గుడిలోకి రానివ్వకపోతే ఇక దేశంలో దళితుల పరిస్థితి ఏంటి అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘునందన్ ఫైర్ అయ్యారు. డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సి వస్తుందనే భయంతోనే.. జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని ఎంపీ రఘునందన్ అన్నారు.
”నేను 5సార్లు తిరుమలకు వెళ్లి పట్టు వస్త్రాలు ఇచ్చానని జగనే స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల వెళ్లారు. ముఖ్యమంత్రి కానప్పుడు పాదయాత్రలో తిరుమల వెళ్లారు. ఆరోజు లేని అభ్యంతరం ఇవాళ ఏం వచ్చింది? ఈరోజు ప్రసాదం విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పినప్పుడు తిరుమల వస్తానని అన్నారు. తిరుమలకు జగన్ రావడంలో తప్పు లేదు. తిరుమల వచ్చినప్పుడు ఆలయ నిబంధనల ప్రకారం ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని హిందూ సమాజం అడిగింది. ఇది జగన్ కు ఒక్కరికే కాదు అందరికీ వర్తిస్తుంది.
రోజూ వేల సంఖ్యలో దళితులు తిరుమలకు వస్తున్నారు. లేని కులం పంచాయితీ ఎందుకు తెస్తున్నారు జగన్? రేపు శ్రీవారి గుడికి వస్తే ఈ డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సి వస్తుందనే జగన్ తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నారు. ఒకవేళ ఈ డిక్లరేషన్ పై సంతకం పెడితే, వాళ్ల చర్చిల యజమానులో, పాస్టర్లో, విదేశాల నుంచి వచ్చే పైసల పంచాయితీనో లేక మరో ఇబ్బంది వస్తుందనే… ఆయనందుకు ఆయనే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు.
Also Read : బొత్స సత్యనారాయణకు తమ్ముడు బిగ్ షాక్..! జనసేనలో చేరేందుకు రెడీ?
ఒక మాజీ ముఖ్యమంత్రిని రానియరా? అంటున్నారు. అలిపిరి దగ్గరే డిక్లరేషన్ ఇస్తాం. జస్ట్ సంతకం పెట్టండి చాలు. లడ్డూల తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని, ప్రసాదం తయారీలో ఓల్డ్ సిస్టమ్ నే మేము ఇంప్లిమెంట్ చేశామని జగన్ చెబుతున్నారు. మరి, డిక్లరేషన్ కూడా అంతే కదా. ఇది కొత్తగా అడగటం లేదు కదా. ఇది కూడా చాలా ఓల్డ్ సిస్టమ్. జగన్ ఆ నిజాన్ని తెలుసుకోవాలి. అన్యమతస్తులు తిరుమల దేవస్థానానికి వచ్చినప్పుడు ఈ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. కేవలం తిరుమలలో మాత్రమే కాదు చాలా ఆలయాల్లో ఈ డిక్లరేషన్ సిస్టమ్ ఉంది. జగన్ కావాలంటే ఆ లిస్టుని నేను పంపిస్తాను” అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
”ఈ దేశంలో చాలా గుడులలో ఈ డిక్లరేషన్ నిబంధన ఉంది. ఇతర మతస్తులు గుడిలోకి వస్తే డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని ఉంది. ఇది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉంది. ఈ డిక్లరేషన్.. బీజేపీనో, రఘునందన్ రావో రాయలేదు. ఇది చాలా ఓల్డ్ సిస్టమ్. లడ్డూల తయారీకి ఏ విధంగా అయితే టెండర్లు పిలుస్తారో అదే రీతిలో అన్యమతస్తులు తిరుమల వచ్చినప్పుడు ఈ డిక్లరేషన్ పై సంతకం పెట్టాలన్నది అక్కడి నియమ నిబంధన. ఈ డిక్లరేషన్ పై సంతకం పెట్టడం జగన్ కు ఇష్టం లేదు. డిక్లరేషన్ పై సంతకం పెడితే తన మతస్తులకు ఎక్కడ కోపం వస్తుందోనని జగన్ భయపడ్డారు. ఆ భయంతోనే తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారు.
నన్నే అడ్డుకుంటే, దళితుల పరిస్థితి ఏంటని జగన్ అంటున్నారు. జగన్ తన స్వప్రయోజనాల కోసం, హిందూ సమాజంలో మళ్లీ కులాల పేరుతో పంచాయితీ పెట్టొద్దని జగన్ ను కోరుతున్నాం. జగన్ తన మాటల్లో బీజేపీ పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు, అందుకే నేను స్పందించాల్సి వచ్చింది. ఆయన మా పార్టీ పేరు తీసుకోకుంటే నేను స్పందించే వాడిని కాదు. ఈ డిక్లరేషన్ ను టీటీడీ రూపొందించింది. వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి ముందు నుంచి ఈ డిక్లరేషన్ ఉంది.
ఈ డిక్లరేషన్ కి, బీజేపీకి, హిందూ టార్చ్ బేరర్స్ కి ఏంటి సంబంధం? హిందూ మతం ఏం చెబుతుందో ప్రపంచం అంతా తెలుసు. అందరినీ గౌరవించే సంస్కారం ఉన్న పార్టీ బీజేపీ. జగన్ తిరుమల వస్తానంటే స్వాగతిస్తాం. కానీ, డిక్లరేషన్ పై మాత్రం సంతకం పెట్టి తీరాల్సిందే. మీకు డిక్లరేషన్ పై సంతకం పెట్టేందుకు మనసు ఒప్పుకోక మాట మారుస్తున్నారు తప్ప.. జగన్ రాకను మేము ఎవరం అడ్డుకోము. దయచేసి డిక్లరేషన్ పై సంతక చేయండి, తిరుమలకు రండి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఇదే మా విజ్ఞప్తి” అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
