Indrakiladri temple
Indrakiladri temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జులై 8 నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి వీఐపీ బ్రేక్, అంతరాలయ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో శీనా నాయక్ తెలిపారు. ఈనెల 10వ తేదీ వరకు బ్రేక్, అంతరాలయ దర్శనాలు ఉండవని చెప్పారు.
ప్రస్తుతం ప్రతీరోజూ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలు ఉంటాయి. అయితే, ఆషాఢం సారె, వారాంతం, శాకంబరీదేవి ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తులు ఇబ్బందులకు గురికాకుండా అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు.
ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర దేవస్థానంలో కనకదుర్గమ్మను ఇలవేల్పు, ఆడపడుచుగా భావిస్తూ ఆషాఢ సారె సమర్పణ చేసి మొక్కులు తీర్చుకోవడానికి గురువారం పెద్ద ఎత్తున భక్తబృందాలు తరలివచ్చాయి. ఆలయ ఉద్యోగులు వారికి స్వాగతం పలికారు. ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు. ఆషాఢ సారె సమర్పణకు ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు తరలి వచ్చారని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో చెప్పారు.