కేంద్ర బడ్జెట్‌..తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యి..ఎందుకు

  • Publish Date - February 2, 2020 / 12:43 AM IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల ఊసేలేదు. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మంజూరు చేయలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులు, రైల్వేలైన్‌లకు కూడా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంపై తెలుగు ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సీజన్‌ కాకపోవడం, రాజకీయ ఒత్తిళ్లు పెద్దగా లేకపోవడంతోనే తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అంతగా ప్రాధాన్యమివ్వలేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

విశాఖ రైల్వే జోన్ :-
విశాఖ రైల్వేజోన్‌ ప్రకటించి ఏడాది కావస్తున్నా ఆచరణలో మాత్రం అర అంగుళం కూడా ముందడుగు పడలేదు. కేంద్ర బడ్జెట్‌లో జోన్‌కు సంబంధించిన నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని ఆశించిన విశాఖ వాసులకు నిరాశే మిగిలింది. వాల్తేరు డివిజన్‌ను విశాఖ జోన్‌లోనే ఉంచుతూ కొత్త రైల్వే మార్గాలు వేయాలని… విశాఖ రైల్వేజోన్‌ పరిధిలో సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులు కేటాయించాలని, అదనపు ట్రాక్‌లతో పాటు ఫ్లాట్‌ ఫాంల నిర్మాణంపైనా కేంద్రం దృష్టి సారించాలని, దేశంలోని వివిధ ప్రదేశాలకు విశాఖ నుంచి నేరుగా కొత్త రైళ్లు కేటాయించాలని నగర వాసులు ఆశించినా ఫలితం లేకపోయింది.

విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చేయలేదు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాజధాని బెంగళురుకు మాత్రం 18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్‌ రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు ఎప్పట్నుంచో చెబుతున్నా… దీనిపై కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనా చేయలేదు.

శ్రీకాళహస్తి- నడికుడి, బెంగళూరు-కడప, కోటిపల్లి-నర్సాపురం లైనుకు సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టత లేదు. వీటన్నింటికీ భూసేకరణ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప… నిధులు మాత్రం కేటాయించడం లేదు. గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని నడికుడి-శ్రీ కాళహస్తి రైల్వేలైను ఏర్పాటుకు భూసేకరణ దశకొచ్చినా పరిహారాలు ఇవ్వలేదు. 308 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన ఈ మార్గానికి 2011లో 1,310 కోట్ల వ్యయం అంచనా వేశారు. ఇప్పుడది 1,600 కోట్లకు పైగా చేరింది.

రాజధాని నిర్మాణానికి నిధులు :- 
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ లోటు బడ్జెట్‌లో ఉన్నందున రాజధాని నిర్మాణానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే సహకరిస్తుందని ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి నిర్మాణానికి 1500 కోట్లు మాత్రమే కేటాయించారు. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తవించలేదు.

ప్రత్యేక హోదా..పోలవరం ప్రాజెక్టు :-
విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చే దిశగా ఆర్థిక మంత్రి ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ముఖ్యంగా ఏపీ ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదాపై బడ్జెట్‌లో కనీస ప్రస్తావన రాలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ… బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై ఊసే లేదు.

తెలంగాణకు మొండిచెయ్యి : –
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సైతం మొండి చెయ్యే చూపించారు. పన్నుల వాటా, గ్రాంట్లు తప్ప రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఇస్తున్న నిధులు పెద్దగా ఏమీ లేవు. విభజన నాటి హామీలూ అమలు కాలేదు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు బీజేపీ హామీ ఇచ్చినా ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. మిషన్‌ భగీరథ, కాళేశ్వరం.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్వహణకు వచ్చే ఐదేళ్లలో 52,941 కోట్లు కేటాయించాలంటూ సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వీటికి సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనా రాలేదు. కాజీపేటలో రైల్వే వ్యాగన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నా కేంద్రం పట్టించుకోలేదు.

Read More : బడ్జెట్ 2020 – 2021..ఊరించి ఉసురు

తెలుగు రాష్ట్రాల్లో పర్యాటక కేంద్రాలు : – 
మరోవైపు వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ అండ్‌ కన్జర్వేషన్‌ పథకం ప్రవేశ పెట్టిన కేంద్రం… అందులో తెలుగు రాష్ట్రాలకు చోటు కల్పించలేదు. హర్యానాలోని రాఖీగఢ్‌, యూపీలోని హస్తినాపూర్‌, అసోంలోని శివసాగర్‌, గుజరాత్‌లోని ధోలావిర, తమిళనాడులోని ఆదిత్య నల్లూరును కేంద్రం ఎంపిక చేసింది. పర్యాటకరంగ అభివృద్ధికి బడ్జెట్‌లో 2వేల కోట్లు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల్లో  ప్రముఖ పర్యాటక కేంద్రాలు అనేకం ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్‌పై తెలుగు ప్రజలు పెదవి విరుస్తున్నారు.