Goutham Reddy : చంద్రబాబు జైలుకి వెళ్లక తప్పదు.. రేపో, మాపో…
ఏపీ ఫైబర్ నెట్ లో కుంభకోణం జరిగిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిని వెలికి తీస్తున్నామని చెప్పారు. రేపో మాపో
- Naveen
- Published On : July 18, 2021 / 07:50 PM IST
Goutham Reddy
Goutham Reddy : ఏపీ ఫైబర్ నెట్ లో కుంభకోణం జరిగిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిని వెలికి తీస్తున్నామని చెప్పారు. రేపో మాపో పేర్లతో సహా అక్రమార్కుల బండారం సీఐడీ బట్టబయలు చేస్తుందని తెలిపారు. 2జీ స్పెక్ట్రమ్ తరహాలో చంద్రబాబు అండ్ కో చేసిన అవకతవకలన్నీ బయటికి వస్తాయని అన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.
చంద్రబాబు కారణంగా ఏపీ ఫైబర్ నెట్ రూ.650 కోట్ల మేర అప్పులపాలైందని మంత్రి ఆరోపించారు. వచ్చే ఏడాది నాటికి ఆ అప్పు అంతటినీ తీర్చేస్తామని అన్నారు. 2021 డిసెంబరు కల్లా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ పార్కులు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.
కాగా, ఏపీ ఫైబర్ నెట్లో అక్రమాలపై సీఐడీ విచారణకు జగన్ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఫైబర్ నెట్ టెండర్లు ఖరారు చేసినట్లు గుర్తించారు.
