పోలీసులు బారికేడింగ్ ఏర్పాటు చేయడంతో సీఎం చంద్రబాబు ఆగ్రహం.. ఏమన్నారో తెలుసా?
Chandrababu Naidu: పోలవరంతోనే పర్యటనలు ప్రారంభమవుతాయని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : June 15, 2024 / 05:51 PM IST
Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసేందుకు అమరావతిలోని టీడీపీ కార్యాలయానికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. సీఎంగా తొలిసారిగా పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వస్తుండటంతో అక్కడ పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
పోలీసులు బారికేడింగ్ ఏర్పాటు చేయడంతో పాత ప్రభుత్వ విధాన హ్యాంగ్ ఓవర్ వీడాలంటూ గట్టిగా చెప్పారు చంద్రబాబు. పార్టీ కార్యాలయంలో బారికేడింగ్ ఏర్పాటు చేయటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇన్నేళ్లు తమ కార్యకర్తల్ని కలుస్తున్నానని, ఎన్నడూ లేని వ్యవస్థ ఇప్పుడెందుకు పెట్టారని ప్రశ్నించారు.
అనంతరం మీడియాతో చంద్రబాబు చిట్ చాట్లో పాల్గొన్నారు. తనకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదని అన్నారు. ప్రజల నుంచి వారి సమస్యల వినతుల స్వీకరణకు ఆలోచిస్తున్నామని తెలిపారు. దీన్ని ఏ పద్ధతులో ఏర్పాటు చేయాలో అభిప్రాయాలు తీసుకుని ఉత్తమ విధానం అమలు చేస్తానని అన్నారు. సెక్రటేరియట్లోనే వినతులు స్వీకరిస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నానని అన్నారు.
ఇక్కడికి రాకపోకల కోసం రవాణా, ఇతరా సౌకర్యాలన్నీ అందుబాటులోకి తెస్తానని తెలిపారు. అప్పట్లో ప్రజావేదిక ఉండి ఉంటే వినతుల స్వీకరణకు అనువుగా ఉండేదని, కానీ, జగన్ దాన్ని కూల్చి వేశారని చెప్పారు. ప్రజా వేదికను విధ్వంస పాలనకు ప్రతీకగా అలానే ఉంటుందని తెలిపారు. ఆ శిథిలాలను తొలగించబోమని తెలిపారు. త్వరలోనే క్షేత్ర స్థాయి పర్యటనలు ప్రారంభిస్తానని చెప్పారు. పోలవరంతోనే పర్యటనలు ప్రారంభమవుతాయని అన్నారు.
Also Read: కేసీఆర్ని దేవుడు కూడా కాపాడలేడు.. ఇప్పటికే జైల్లో కవిత: మంత్రి కోమటిరెడ్డి
