టీడీపీ రెండో జాబితా సిద్ధం.. గురువారం ప్రకటిస్తాం: చంద్రబాబు
Chandrababu Naidu: జనసేన, బీజేపీ ఏయే స్థానాల్లో పోటీ చేయాలో కూడా వారికి స్పష్టత ఉందని చెప్పారు.
- T Venkateshwarlu
- Published On : March 13, 2024 / 03:30 PM IST
Chandrababu Naidu
ఎన్నికల్లో పోటీచేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను గురువారం ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంతమంది వీలైతే అంతమంది అభ్యర్థుల్ని ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థుల కసరత్తు తుదిదశకు చేరుకుందని తెలిపారు.
జనసేన, బీజేపీ ఏయే స్థానాల్లో పోటీ చేయాలో కూడా వారికి స్పష్టత ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. సమయానుకూలంగా ఆ రెండు పార్టీలు వారి అభ్యర్థుల్ని ప్రకటిస్తాయని తెలిపారు. యువతలో చైతన్యం లేకుంటే సమాజం బాగుపడదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో పెట్టుకున్న పొత్తులు తమ కోసం కాదని, ప్రజల కోసమేనని తెలిపారు.
పొత్తు ఎందుకని టీడీపీ-బీజేపీ-జనసేన నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచనే చేయకూడదని చంద్రబాబు నాయుడు అన్నారు. టిక్కెట్లు రాలేదని ఎవ్వరూ బాధపడొద్దని చెప్పారు. కొందరు రకరకాలుగా మాట్లాడతారని, తాను వాటిని పట్టించుకోనని తెలిపారు. తాము గతంలోనూ ఎన్డీఏలో పని చేశామని చెప్పారు. వాజ్ పేయి హయాంలో కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోవాలన్నా తీసుకోలేదని తెలిపారు. 2014లో కేంద్రంలో భాగస్వాములయ్యామని చెప్పారు.
Also Read: సీఏఏ అమలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
