CITU released fake votes in booth number 221 KB layout in Tirupati MLC election
AP MLC Election 2023 : తిరుపతి ఎమ్మెల్సీ ఓటర్ల లిస్టులో ఫేక్ ఓటర్ల లిస్టు వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఈ నకిలీ ఓటర్ల కథలు కమామీషులు మామూలుగా లేవు. ఏకంగా ఒక వ్యక్తి పేరుతో రెండు కాదు మూడు కాదు ఏకంగా 11 ఓట్లు ఉన్నాయి..అంతేకాదు మరింతగా షాక్ అయ్యే విషయం ఏమిటంటే ఆ 11 ఓట్లు ఉన్న వ్యక్తికి 11మంది తండ్రులు ఉన్నారట..!! ఈ నిర్వాకాన్ని CITU (Centre of Indian Trade Unions) జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీ బయటపెట్టారు.
తిరుపతి నగరంలోని 221 వ పోలింగ్ బూత్ పరిధిలోని కేబి లేఔట్ 6-19-57-354 ఇంటి నెంబరుతో ఒకే వ్యక్తి పేరిట 11 ఓట్లు నమోదు జరిగినట్లుగా గుర్తించారు మురళి. 760, 763, 765, 766, 768, 769, 770, 772, 773, 775, 778 సీరియల్ నంబర్లలో A మణి అనే ఓటరు పేరు 11 సార్లు నమోదు కావడమే కాకుండా..ఒక్కో నంబరు దగ్గర తండ్రి పేరు కూడా వేరు వేరుగా ఉన్నాయని గుర్తించారు. సదరు ఓటరుకు 11 రకాలు తండ్రి పేర్లు ఉన్నాయని గుర్తించారు. ఇటువంటి నకిలీ ఓట్ల విషయాన్ని సీరియస్ గా తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నేత మురళీ డిమాండ్ చేశారు. ఓటర్ల నమోదులో అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ (వైసీపీ)కి బుద్ధి చెప్పాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీ డిమాండ్ చేశారు.
తిరుపతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి అధికార పార్టీ అనుసరిస్తున్న అడ్డదారులకు అంతులేకుండాపోతోందని పలువురు గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ అడ్డదారుల్లో గెలుపొందటానికి తిరుపతిలో భారీగా బోగస్ ఓట్లు నమోదు చేయించిందని ఆరోపిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్న ఇటువంటి దారుణాలతో కనీసం కాలేజీ మెట్లు కూడా ఎక్కనివారు కూడా గ్రాడ్యుయేట్లుగా చెలామణి అయిపోతున్నారని ఈ బోగస్ ఓట్లు తమపార్టీవారివే కాటంతో అధికార పార్టీ ఆగడాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి. బోగస్ గ్రాడ్యుయేట్లు ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేలా అధికార పార్టీ వైసీపీ కుట్రలు చేస్తోందని ప్రతిపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి. తిరుపతిలో వైసీపీ కార్యాలయ చిరునామాతో 30 మంది ఫేక్ గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదైనట్లుగా సమాచారం. చదువులేని వారు సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లర్లుగా చెలామణి అవుతున్నారని ఆరోపిస్తున్నారు.