వారిని వదిలేది లేదు- అక్రమ బియ్యం వ్యాపారంపై మంత్రి నాదెండ్ల సీరియస్

ఈ అక్రమ బియ్యం వ్యాపారంలో కొంతమంది అధికారుల సహకారం కూడా ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది.

Minister Nadendla Manohar : ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. రైస్ మిల్లుల గోడౌన్ లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. కాకినాడ సిటీ, రూరల్, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని 10 రైస్ మిల్లుల గోడౌన్ లలో మంత్రి మనోహర్ తనిఖీలు నిర్వహించారు. అక్రమ బియ్యం వ్యాపారం తారస్థాయికి చేరిందని ఆయన ఆరోపించారు. అక్రమ బియ్యం వ్యాపారంలో కొంతమంది అధికారుల సహకారం ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని మంత్రి మనోహర్ తెలిపారు.

రైస్ మిల్లుల అక్రమాల వెనక ద్వారంపూడి అనుచరులు ఉన్నారని ఆయన ఆరోపించారు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన మంత్రి మనోహర్.. ప్రతి ఒక్కరిపై 6ఏ కేసులు నమోదు చేస్తామన్నారు. కాకినాడ రూరల్ తోరంగిలో విష్ణు పట్టాభిరామ రైస్ ఇండస్ట్రీలో మంత్రి నాదెండ్ల తనిఖీలు చేశారు. రైస్ మిల్లు లోపల బియ్యాన్ని పరిశీలించారు.

”కాకినాడ సిటీ, రూరల్, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో 10 రైస్ మిల్లులు గోడౌన్ లలో ఆకస్మిక తనిఖీలు చేశాం. ఈ రైస్ మిల్లుల వెనకాల చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అందరూ బయటకు వస్తారు. ఒక కుటుంబం బాగుపడడం కోసం పేదలకు అన్యాయం చేశారు. ద్వారంపూడి, ఆయన అనుచరులు ఈ రైస్ మిల్లుల వెనక ఉన్నారు. 6 రైస్ మిల్లులలో పీడీఎస్ రైస్ ఆధారాలను గుర్తించాము. తప్పు చేసిన ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరిపైన చట్టపరమైన 6ఏ కేసులు నమోదు చేస్తాము. ఈ అక్రమ బియ్యం వ్యాపారంలో కొంతమంది అధికారుల సహకారం కూడా ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. వారిపై కూడా చర్యలు తీసుకుంటా. అక్రమం బియ్యం వ్యాపారం తారస్థాయికి చేరింది. ఈ వ్యాపారం చేసే వాళ్లు సముద్రంలో వెసలు కొనే స్థాయికి వచ్చారు” అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.

Also Read : జాతి క్షమించరాని నేరానికి జగన్ పాల్పడ్డారు- పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

ట్రెండింగ్ వార్తలు