CM Chandrababu Naidu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొందరు అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొందరు అధికారులు మానవత్వంతో వ్యవహరించడం లేదంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కావాలనే వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైన అలాంటివారు తీరుకోమార్చుకోవాలని.. లేకుంటే ఇకపై చర్యలు ఉంటాయని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితులకు అన్ని రకాలుగా సాయం అందిస్తున్నామని, లోతట్టు ప్రాంతాల్లో ఉండే చివరి వ్యక్తికి సాయం అందాలని, ఏ విధంగానైనా సాయం చేయాలని స్పష్టం చేశారు.
ఫుడ్ డెలివరీ కోసం ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేశాం. వార్డు సచివాలయాల పరిధిలో ఫుడ్ సరఫరా చేపడతామని అన్నారు. ఇళ్లల్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయి. అధికార, పోలీసు యంత్రాంగం సరియైన రీతిలో వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ప్రజలు బాధలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా అధికారులు వ్యవహరించాలి. తప్పు జరిగితే సహించను. కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సమాచారం రప్పించుకుంటున్నామని చెప్పారు. ప్రజలు కూడా సంయమనం పాటించాలని కోరారు. శక్తిమేరకు బాధితులను ఆదుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Also Read : AP : ఏపీకి ముంచుకొస్తున్న మరో ముప్పు.. భారీ వర్షాలు కురిసే అవకాశం
ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం చేయడం తగదు. ఐదేళ్లు వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. జక్కంపూడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ అధికారిని సస్పెండ్ చేశాను. మంత్రులైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిమీద కూడా చర్యలు ఉంటాయని చంద్రబాబు అన్నారు. కొందరు అధికారులను వరద సహాయక చర్యలకు పంపితే సరిగా పనిచేయకుండా తేడాగా వ్యవహరించారు. ఇలాంటి అధికారులను ఉపేక్షించనని అన్నారు. జీతం తీసుకుని ప్రజలకోసం పనిచేయరా? అధికారులకు బాధ్యత లేదా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా అధికారులేంటి ఇలా పనిచేస్తున్నారని కొందరు నన్నే అడుగుతున్నారు. మృతదేహం ఉంటే చూసీచూడనట్లు వెళ్లిపోతారా? కొందరు అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. వరదతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాజకీయం చేస్తారా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జక్కంపూడి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. సోమవారం జక్కంపూడి ప్రాంతంలో సరిగా సహాయక చర్యలు జరగలేదని ఫిర్యాదులొచ్చాయి. దీంతో చంద్రబాబే స్వయంగా క్షేత్ర స్థాయికి బయలుదేరి వెళ్లారు.