ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని ఉద్బోధ

అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్బోధించారు.

cm chandrababu naidu comments ministers performance in AP cabinet meeting

CM Chandrababu on Ministers మంత్రివర్గ సమావేశం ముగిశాక వివిధ రాజకీయ అంశాలపై మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నానని, అన్ని విషయాలు బయటకు చెప్పలేమని అన్నారు. ఉచిత ఇసుక రీచుల విధానంలో జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మంత్రులకు హితవు పలికారు. ఎమ్మెల్యేల జోక్యం కూడా ఉండకూడదని, అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని, 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక డంప్ యార్డుల్లో ఉందని.. ఈ 3 నెలల్లో కోటి మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉంటుందని చెప్పారు. బోట్ సొసైటీలు, నదుల్లో పూడిక తీయటం ద్వారా దాదాపు 80 లక్షల టన్నుల ఇసుక వస్తుందని వెల్లడించారు.

నెల రోజుల మంత్రుల పని తీరుపై చర్చ
ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్టులో ఉందని గ్రహించి మసలుకోవాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. హెచ్వోడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల నెలా సమీక్షలు చేపట్టాలని ఆదేశించారు. తమ శాఖలకు చెందిన పరిస్థితిని ప్రజలకు వివరించాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు ఉద్బోధించారు. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా మంత్రులు సమన్వయంతో వెళ్లాలన్నారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని మరోసారి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

అవగాహన పెంచుకోండి
”ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారు, అందుకు తగ్గట్టు పనిచేయాలి. సీనియర్ మంత్రులు సైతం నిత్య విద్యార్థుల్లా కొత్త విషయాలు నేర్చుకోవాలి. నేను ఇవాళ్టికీ కొత్త విషయాలు నేర్చుకుంటున్నా, ఇంకా నాకు తెలియని అంశాలు చాలా ఉన్నాయి. కొత్త వాళ్ళు మంత్రివర్గంలో చాలా మంది ఉన్నారు, సబ్జెక్టులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోండి. ఆగస్టు 1న ఇళ్ల వద్ద ఫించన్ పంపిణీలో పాల్గొందాం. ఏటా రూ. 35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు మనం వెళ్లి ఇవ్వటం బాగుంటుంద”ని సీఎం చంద్రబాబు అన్నారు.

5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 22 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నాం. తొలిరోజు సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చిద్దాం. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పెడదాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో అసెంబ్లీలో చర్చ జరగాలి. పంటల బీమా పథకం పకడ్బందీ అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తున్నాం. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతుల్ని మోసగించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రూ.1600 కోట్లు రుణం తెచ్చి, వెయ్యి కోట్లు మాత్రమే రైతులకిచ్చారు. మిగిలిన రూ. 600 కోట్లు ఏమైయ్యాయె ఇంకా తెలియట్లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం

ద్వారంపూడి బియ్యం అక్రమాలపై చర్చ
కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం అక్రమాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. తండ్రి పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, కొడుకు ఎమ్మెల్యే, ఇంకో కొడుకు రైస్ మిల్లర్ల అసోసియేషన్ చైర్మన్.. ఈ ముగ్గురూ కలిసి బియ్యం రీసైక్లింగ్ చేసి కిలో రూ.43కు ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన సూచించగా, వచ్చే మంత్రివర్గం కల్లా ఏం చేద్దామనే దానిపై విధి విధానాలతో రావాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు.

ట్రెండింగ్ వార్తలు