Veligonda Project: 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. రేపే ‘వెలిగొండ ప్రాజెక్టు’ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
వెలిగొండ (Veligonda Project)సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించనున్నాడు.
- V Santhosh Kumar
- Published on- August 30, 2026 / 05:59 PM IST
cm chandrababu naidu inaugurates veligonda project phase 1
- వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1
- కరువు నేలకు కృష్ణా జలాలు
- శంకుస్థాపన, ప్రారంభం చంద్రబాబే
Veligonda Project: దశాబ్దాలుగా తీవ్ర వర్షాభావం, ఫ్లోరైడ్ సమస్యలతో కరువును ఎదుర్కొంటున్న ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. వెలిగొండ (Veligonda Project)సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం స్వయంగా ప్రారంభించి నల్లమలసాగర్కు కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు. 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబే, 30 ఏళ్ల తర్వాత దాని తొలి దశను ప్రారంభించడం ఒక అరుదైన చారిత్రక ఘట్టంగా నిలిచింది. ‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు’ పేరిట ప్రభుత్వం ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తోంది.
4.47 లక్షల ఎకరాలకు సాగునీరు – 23 లక్షల మందికి దాహార్తి తీర్చే ప్రాజెక్టు:
శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 మండలాల్లోని 23 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఫేజ్-1 కింద 10.70 టీఎంసీల నీటిని విడుదల చేయడం ద్వారా తొలి విడతలోనే 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు లభించనుంది. దీనివల్ల వ్యవసాయ రంగానికి భరోసా పెరిగి, ఉపాధి అవకాశాలు మెరుగై గిరిజన, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలకు అడ్డుకట్ట పడనుంది.
48 రోజుల్లో రూ.768 కోట్ల పరిహారం – వేగంగా సీఎం పర్యటన షెడ్యూల్:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితుల పరిహారానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. కేవలం 48 రోజుల వ్యవధిలోనే రూ.768 కోట్ల పరిహారాన్ని చెల్లించి పనులను వేగవంతం చేసింది. షెడ్యూల్ ప్రకారం సీఎం చంద్రబాబు ఉదయం 10.15 గంటలకు దోర్నాల మండలం గంటవానిపల్లి చేరుకుంటారు. ప్రత్యేక పూజల అనంతరం వెలిగొండ ఫేజ్-1ను ప్రారంభించి, పైలాన్ ఆవిష్కరించి జలాలను విడుదల చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
