Vijayawada Floods : ప్రతీ ఇంటికి సహాయం అందించాలి.. మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయండి : సీఎం చంద్రబాబు

విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలి. శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాలి. ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయండి.

CM Chandrababu naidu

CM Chandrababu Naidu : వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతీ ఇంటికి సహాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులను ఆదేశించారు. బుధవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నాం. ప్రతీ ఇంటికి సహాయం అందించాలి. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించండి. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించండి. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందించాలి. వరద తగ్గినందును ఆహారం డోర్ టు డోర్ వెళ్లే అవకాశం ఉంది. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, రెండు కేజీలు ఉల్లిపాయలు, రెండు కేజీలు బంగాళదుంప, కేజీ చక్కెర అందించాలని చంద్రబాబు సూచించారు. మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతితక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు.

Also Read : తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. యుద్ద ప్రాతిపదికన టెలికాం నెట్‌వ‌ర్క్‌ను పునరుద్దరించిన జియో

నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరదాం. ఆహారం, నీరు, బిస్కెట్స్, పాలు, అరటి పండ్లు అన్నీ డోర్ టు డోర్ అందించాలని మంత్రులు, కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు. అన్ని అంబులెన్స్ లు పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టండి. విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలి. శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాలి. ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయండి. వైరల్ ఫీవర్లు, దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్య పరచండి. ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి. ఎవరికి ఏ మెడిసిన్ కావాలన్నా అందించాలని అన్నారు. పంట నష్టంపైనా అంచనాలు నమోదు చేయాలని చంద్రబాబు సూచించారు.

Also Read : కూటమి సర్కార్ దూకుడు.. వైసీపీకి మరిన్ని చిక్కులు తప్పవా?

మంత్రులు, అధికారులు మాట్లాడుతూ.. ఈ ఉదయం 2.3 లక్షల అల్పాహారం ప్యాకెట్లు పంపించాం. 4.5 లక్షల మందికి మధ్యాహ్నం, సాయంత్రానికి భోజనం సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. 2.5లక్షల పాల ప్యాకెట్లు, ఐదు లక్షల వాటర్ బాటిళ్లతోపాటు 117 ట్యాంకర్లను పంపించాం. మరో 6 లక్షల నీళ్ల బాటిళ్లు సిద్ధంగా ఉంచాం. ప్రస్తుతం 50 ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి. వాటితో పారిశుధ్య పనులు మొదలు పెట్టామని మంత్రులు చంద్రబాబుకు వివరించారు.

 

ట్రెండింగ్ వార్తలు