AP Annadata Sukhibhava Scheme: అన్నదాత సుఖీభవ పథకం అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. ఆగస్ట్ 2న ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అదేరోజు పీఎం కిసాన్ పథకం కింద నిధులను విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఇచ్చే రూ.6వేల సాయంతో కలిపి రాష్ట్ర వాటాగా మరో రూ.14వేలు ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ పథకం కింద ఏడాదికి రైతుకు రూ.20వేల నగదును 3 విడతలుగా ఇవ్వనుంది ప్రభుత్వం.
మొదటి విడతలో రాష్ట్రం వాటా రూ.5వేలు, కేంద్రం వాటా రూ.2వేల చొప్పున ఆగస్ట్ 2న విడుదల చేయనుంది. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ’తో లబ్ది కలగనుంది. ఇందుకోసం రూ.2,342.92 కోట్ల నిధులను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ మొదటి విడత కింద రూ.831.51 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయనుంది కేంద్రం. ఆగస్ట్ 2న ప్రకాశం జిల్లా దర్శిలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.