CM Jagan Polavaram Tour: దెబ్బతిన్న డయాఫ్రం వాల్ను త్వరగా పూర్తిచేయాలి.. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం జగన్
పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిస్ట్ ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. పోలవరం వద్ద పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాలని...
- Harishth Thanniru
- Published On : June 6, 2023 / 02:05 PM IST
CM Jagan Polavaram Tour
AP CM Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. మంగళవారం ఉదయం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న జగన్.. ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్ వద్ద జరుగుతున్న పనులు.. అన్నింటినీ సమగ్రంగా పరిశీలించారు. గత సీజన్లో అనూహ్యంగా వచ్చిన వరద విపత్తును తట్టుకునేందుకు ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంపు, ఇటీవల నిర్మాణం పూర్తిచేసుకున్న దిగువ కాఫర్ డ్యాంను, డయాఫ్రం వాల్ ప్రాంతంలో కొట్టుకుపోయిన ఇసుకను నింపే పనులను, అదేవిధంగా వైబ్రో కాంపాక్షన్ పనులను సీఎం జగన్ పరిశీలించారు. డయాఫ్రం వాల్ ప్రాంతంలో పున: నిర్మాణాలు, ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాలపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు.
CM Jagan Polavaram Tour
పోలవరం ప్రాజెక్టులో తొలిదశను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని, రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థికశాఖ మెమోరాండం జారీ చేసిందని, దీన్ని కేంద్ర జలశాఖకు లేఖద్వారా తెలిపిందని సీఎం జగన్కు అధికారులు తెలిపారు. గైడ్వాల్పై సమీక్షా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. గైడ్వాల్ డిజైన్లన్నీ కేంద్ర జలసంఘం, సీడబ్ల్యూసీ ఖరారు చేసిందని, వారి ఆమోదంతోనే పనులు చేశామని అధికారులు సీఎం జగన్కు వివరించారు. ప్రస్తుతం వచ్చిన సమస్యనుకూడా వారికి నివేదించామని అధికారులు తెలిపారు. దీన్ని సరిదిద్దడం పెద్ద సమస్య కాదని, సీడబ్ల్యూసీ పరిశీలన కాగానే వారి సూచనల మేరకు వెంటనే మరమ్మతులు చేస్తామని అధికారులు జగన్ కు తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్నచిన్న సమస్యలు వస్తాయని, వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగుతారన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఎగువ కాఫర్ డ్యాంలో ఖాళీలు వదిలేశారని, ఈ ఖాళీల గుండా వరదనీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని జగన్ పేర్కొన్నారు. ఈఎస్ఆర్ఎఫ్ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రంవాల్ దారుణంగా దెబ్బతిందని, దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యంకావడమే కాదు, రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని అన్నారు.
CM Jagan Polavaram Tour
CM Jagan : ట్రాక్టరెక్కిన ముఖ్యమంత్రి
దెబ్బతిన్న డయాఫ్రం వాల్ను త్వరగా పూర్తిచేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇది పూర్తైతే మెయిన్ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిస్ట్ ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. పోలవరం వద్ద పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాలని, మరిన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. నిర్వాసిత కుటుంబాలకు పునరాసంపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. పునరావాసం కాలనీల్లో అన్ని సామాజిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు జగన్ సూచించారు. కాలనీలు ఓవైపు పూర్తవుతున్నకొద్దీ, సమాంతరంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో 12,658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని అధికారులు సీఎం జగన్కు వివరించారు.
CM Jagan Polavaram Tour
ఇదిలాఉంటే.. పోలవరం ప్రాజెక్టులో కీలక పనుల్లో ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. స్పిల్వే కాంక్రీట్ పూర్తి, 48 రేడియల్ గేట్లు పూర్తిస్థాయిలో అమర్చడం జరిగిందని, రివర్ స్లూయిస్ గేట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం పూర్తయిందని, గ్యాప్ -3 వద్ద కాంక్రీట్ డ్యాం పూర్తయ్యిందని, పవర్హౌస్లో సొరంగాల తవ్వకం పూర్తయిందని చెప్పారు. అప్రోచ్ ఛానల్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని, ఈసీఆర్ఎఫ్ డ్యాంలో దెబ్బతిన్న గ్యాప్-1 ప్రాంతంలో ఇసుక నింపే కార్యక్రమం పూర్తయ్యిందని, ఆప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్కూడా పూర్తయ్యిందని అధికారులు జగన్ కు వివరించారు. ఈసీఆర్ఫ్ గ్యాప్-2 ప్రాంతంలో నింపడానికి అవసరమైన 100శాతం ఇసుక రవాణా పూర్తయ్యిందని, ఇక వాటిని నింపే పనులు చురుగ్గా ముందుకు సాగుతున్నాయని అన్నారు.
పోలవరం ప్రాజెక్టులో నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం. pic.twitter.com/4es5GqhYKc
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 6, 2023
