ఏం చర్చిస్తారో!.. ఏపీ క్యాబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో ఇచ్చే చేయూత, జగనన్న కాలనీల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
- Harishth Thanniru
- Published On : January 31, 2024 / 07:40 AM IST
CM Jagan
AP Cabinet Meeting : ఏపీ క్యాబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. ఉదయం 11గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు భేటీ కానున్నారు. ఓటాన్ ఎకౌంట్, బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా కేబినెట్ లో చర్చించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అసంతృప్త వర్గాలను మచ్చిక చేసుకునే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో కేబినెట్ సమావేశంలో నిర్ణయాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 5 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల విషయంపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Also Read : 70ఏళ్ల రాజకీయానికి ఫుల్స్టాప్.. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలకు గల్లా కుటుంబం దూరం
మరోవైపు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో ఇచ్చే చేయూత, జగనన్న కాలనీల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూముల కేటాయింపులను ఆమోదం తెలపనుంది. అజెండాలోని లేని అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఉద్యోగులకు సంబంధించి 12వ పీఆర్ సీని 2023 జులై 1వ తేదీ నుంచి అమలు చేయాల్సి ఉండటంతో.. ఐఆర్ పై కేబినెట్ లో చర్చించనున్నారు.
Also Read : వైసీపీలో మార్పులు.. సంబరపడిపోతున్న ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే..! ఎందుకో తెలుసా
టికెట్ కోల్పోయిన ఎమ్మెల్యేల్లో కొందరు తిరుగుబాటు జెండా ఎగరవేయడం, ఆశావాహుల్లో అసంతృప్తి నెలకొనడంపై సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో గెలుపు అవకాశాలు తక్కువైన నియోజకవర్గాలపై కేబినెట్ లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమస్యల పరిష్కారంపై సీనియర్ మంత్రులు దృష్టిపెట్టాల్సిన అంశాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ పై చేసే కామెంట్స్ పై ఈ సమావేశంలో ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది. షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేలా పలువురికి జగన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
