రాష్ట్రంలో మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ- రక్షాబంధన్లో భాగంగా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్ ఉమెన్కు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నెల రోజులపాటు ఆన్లైన్లో శిక్షణ నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘ఈ- రక్షాబంధన్’ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు సోమవారం (ఆగస్టు3, 2020) ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాగా ఈ- రక్షాబంధన్ ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే విడదల రజిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సీఎం జగన్ చేతికి రాఖీ కట్టారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్స్, రీడింగ్ మెటీరియల్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్కాచెల్లెమ్మలకు ఏదైనా సమస్య ఉంటే దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం మహిళా సాధికారికతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని పునరుద్ఘాటించారు.
అన్ని రంగాల్లో వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. సుమారు 30 లక్షలమంది మహిళల పేరుతో ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధంలో భాగంగా బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్ లను పూర్తిగా తొలగించామని చెప్పారు. 33 శాతం వైన్షాపులను తగ్గించామని తెలిపారు.