CM Jagan Election Campaign : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో ఎన్నికల ప్రచార యాత్రకు సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి మలివిడత ఎన్నికల ప్రచారంకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. రోజుకు మూడు సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ కు వైసీపీ ముఖ్య నేతలు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు (ఆదివారం) అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్ఆర్ సర్కిల్ లో ఉదయం 11గంటలకు నిర్వహించే బహిరంగ సభతో జగన్ మలివిడత ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్ లో నిర్వహించే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్ సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్ లో జరిగే సభలోనూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
Also Read : Velampalli Srinivasa Rao : బోండా ఉమపై మూడు ఫిర్యాదులు చేశాం: వెలంపల్లి శ్రీనివాసరావు
సోమవారం షెడ్యూల్ ఇలా..
సీఎం జగన్ మోహన్ రెడ్డి 29 (సోమవారం) అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ మేరకు శనివారం షెడ్యూల్ విడుదల చేశారు. 29వ తేదీ ఉదయం 10గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించే బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరంలో జరిగే సభలో పాల్గొని మాట్లాడతారు. సాయంత్రం 3గంటలకు గుంటూరు జిల్లా పొన్నూరు సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.