తూర్పుగోదావరి జిల్లాపై కరోనా కత్తి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ పేట్రేగిపోతుంది. గడిచిన 24 గంటల్లో వెయ్యి 204 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 12వేల 483కు చేరింది. ట్రూనాట్‌, ఆర్టీపీసీఆర్‌ ద్వారా చేసిన పరీక్షల్లో 580 మందికి, ర్యాపిడ్‌ యాంటీజెంట్‌ కిట్ల ద్వారా చేసిన పరీక్షల్లో 624 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.

కాకినాడ నగరంలో 278, రాజమహేంద్రవరంలో 116, గ్రామీణ మండలంలో 83, కాకినాడ గ్రామీణంలో 62, కరపలో 50 అత్యధికంగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 113 మంది మృతిచెందినట్లు రాష్ట్ర కొవిడ్‌ విభాగం శనివారం బులెటిన్‌లో పేర్కొన్నారు. తాజాగా ఆరుగురు చనిపోయారని తెలిపింది.

పెద్దాపురం మున్సిపల్‌ ఆర్‌ఐ (55) స్థానిక ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. రాయవరంలో, పిఠాపురం మండలం నరసింగపురంలో, శంఖవరంలో, కోరుకొండలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు వదిలారు. మిగిలిన మృతుల వివరాలు అధికారులు వెల్లడించాల్సి ఉంది. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ శనివారం నలుగురు మృతిచెందారని నోడల్‌ అధికారి డా.కిరణ్‌ తెలియజేశారు.

కాకినాడ జగన్నాథపురం వాసి, సామర్లకోటకు చెందిన వ్యక్తి, కాకినాడకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం సహాయకచర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కట్టడి కావడం లేదు.