CPI RamaKrishna: చంద్రబాబు అలా చేస్తే, జగన్ నెత్తిన పాలు పోసినట్లే -సీపీఐ రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై, వైసీపీ ఎంపీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- vamsi
- Published On : October 23, 2021 / 12:09 PM IST
Cpi Ramakrishna
CPI RamaKrishna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై, వైసీపీ ఎంపీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన 22మంది ఎంపీలున్నా కూడా ప్రత్యేకహోదా విషయంలో పార్లమెంట్లో ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తీసుకురాకపోవడమే ప్రస్తుత దివాళాకి కారణమన్నారు రామకృష్ణ.
ఎన్నికల్లో హామీలు గుప్పించి, వాటిని సాధించడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని అన్నారు రామకృష్ణ. లక్షల కోట్ల అప్పులు తెచ్చేందుకు కేంద్రం వైపు ప్రభుత్వం చూడాల్సిన పరిస్థితి వచ్చిందని, ఏ రంగంలో అభివృద్ధి చెందిందో చెప్పమంటే ఒక్క మంత్రి నుంచి కూడా సమాధానం లేదన్నారు. అప్పులు తెస్తే తప్ప రాష్ట్రంలో జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు.
మంత్రులందరూ డమ్మీలని, రెండున్నరేళ్లలో ఏ పార్టీ వారూ సీఎం జగన్ని కలవలేకపోయినట్లు చెప్పారు. సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే జగన్ను కలిసే పరిస్థితి లేదన్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైందని, దళితులపై అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితికి రాష్ట్రం దిగజారిందన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పట్టాభి ఇంటిపైన, టీడీపీ కార్యాలయంపై దాడి చేసినవారిని అరెస్ట్ చేయరా..? అని ప్రశ్నించారు.
చంద్రబాబు కూడా రాష్ట్రపతి పాలన కోరితే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే, జగన్ నెత్తిన పాలు పోసినట్టేనని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. అమరావతి, పోలవరం ఆటకెక్కాయని అన్నారు రామకృష్ణ.
