Tirumala Leopard Attack: రెండు చిరుతల డీఎన్ఏ నివేదికలు వచ్చేశాయ్.. అందులో బాలికపై దాడిచేసిన చిరుత ఏదంటే?
ఆగస్టు నెలలో బోనులో చిక్కిన చిరుతల్లో చిన్నారిని హతమార్చిన చిరుత ఏది అనే విషయాన్ని తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు వాటి డీఎన్ఏ పరీక్షకోసం
- Harishth Thanniru
- Published On : September 16, 2023 / 01:36 PM IST
Leopard Attack
Leopard Attack: గత నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల దారిలో వెళ్తున్న నాలుగేళ్ల బాలికపై చిరుత పులి దాడిచేసి హతమార్చిన విషాద ఘటన తెలిసిందే. అయితే, ఈ ఘటన తరువాత తిరుమల నడకదారిలో టీటీడీ, అటవీశాఖ అధ్వర్యంలో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు.. తిరుమల నడకదారిలో పలు ప్రాంతాల్లో చిరుత పులిని బంధించేందుకు బోనులను ఏర్పాటు చేశారు. చిన్నారి మృతి ఘటన తరువాత రెండు రోజుల్లో చిరుత బోనులో చిక్కింది. మోకాలిమిట్ట, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లను అధికారులు ఏర్పాటు చేయగా.. గత నెల 14న చిరుత బోనులో చిక్కింది. మరికొద్ది రోజులకే గతనెల 17వ తేదీన మరో చిరుత బోనులో చిక్కింది. ఆగస్టు చివరి వారంలో మరో చిరుత చిక్కింది. ఇలా మూడు నెలల క్రితం బోనులో చిక్కిన చిరుతతో పాటు, ఆగస్టు నెలలో మూడు చిరుతలు మొత్తం నాలుగు చిరుతలను టీటీడీ, అటవీశాఖ ఆధ్వర్యంలో బంధించారు.
Leopard attacks : నిద్రిస్తున్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి
ఆగస్టు నెలలో బోనులో చిక్కిన చిరుతల్లో చిన్నారిని హతమార్చిన చిరుత ఏది అనే విషయాన్ని తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు వాటి డీఎన్ఏ పరీక్షకోసం ముంబయిలోని ల్యాబ్కు నమూనాలను పంపించారు. పట్టుబడిన నాలుగు చిరుతల్లో రెండు చిరుతల డీఎన్ఏ నివేదికలు వచ్చాయి. ఈ నివేదికల్లో చిన్నారిపై దాడికి మొదటి రెండు చిరుతలకు సంబంధం లేదని తేలింది. చిరుత గోళ్లు, రక్త నమూనాల ద్వారా నిర్ధారణ చేశారు. చిన్నారిపై దాడిచేసి హతమార్చిన ఘటనలో రెండు చిరుతలకు సంబంధం లేదని తేలడంతో ఒక చిరుతను విశాఖ జూ పార్క్కు తరలించి, మరో చిరుతను నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు విడిచిపెట్టారు.
మిగిలిన రెండు చిరుతలకు సంబంధించి డీఎన్ఏ నివేదిక ఇంకా రావాలసి ఉంది. నివేదికతో సంబంధం లేకుండా ఈ రెండు చిరుతలను తిరుపతి జూ పార్క్లోనే ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. వీటికి పళ్ళు ఊడినట్లు గుర్తించారు. దీంతో అవి స్వతహాగా వేటాడే సామర్థ్యం తగ్గినందున జూలో ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
