Tirupati Earthquake : తిరుపతి జిల్లాలో పలు చోట్ల భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.9గా నమోదైంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని దొరవారి సత్రం నందు గురువారం రాత్రి 8.45 గంటలకు, సూళ్లూరుపేట మండల పరిధిలోని దామ నెల్లూరు, సుగ్గుపల్లి, ఉట్చూరు, మంగళంపాడు గ్రామాల్లో రాత్రి 8.43 గంటలకు రెండు నుంచి మూడు సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది.
పలు ప్రాంతాల్లోనూ స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. భూప్రకంపనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదని తిరుపతి జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావొద్దని సూచించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే 08772 236007 నంబర్కు కాల్ చేయాలని తెలిపారు.