ఓటరుని కొట్టిన తెనాలి ఎమ్మెల్యేపై ఈసీ ఆగ్రహం.. స్పందించిన శివకుమార్
Annabathuni Siva Kumar: పోలింగ్ కేంద్రంలో ఓటరుని కొట్టిన ఘటనపై శివకుమార్ స్పందించారు. ఐతానగర్లో తన భార్యతో కలిసి..
- T Venkateshwarlu
- Published On : May 13, 2024 / 04:53 PM IST
Annabathuni Siva Kumar: ఆంధ్రప్రదేశ్లోని తెనాలి ఎమ్మెల్యే శివకుమార్పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యే వరకూ శివకుమార్ను గృహ నిర్భంధంలో ఉంచాలని ఈసీ చెప్పింది. తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరిగిన ఘటలను తీవ్రంగా పరిగణించిన ఈసీ. కేసులు కూడా పెట్టాలని ఆదేశించింది.
పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పింది. సాయంత్రం 4-6 గంటల మధ్య ఎటువంటి అనుచిత ఘటనలు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. పలు అవాంఛనీయ ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారం ముకేశ్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎన్నికల, పోలీస్ యంత్రాంగాలను ఆదేశించారు.
శివకుమార్ స్పందన
పోలింగ్ కేంద్రంలో ఓటరుని కొట్టిన ఘటనపై శివకుమార్ స్పందించారు. ఐతానగర్లో తన భార్యతో కలిసి ఓటు వేయడానికి వెళ్లానని తెలిపారు. కొన్ని వర్గాలకు కొమ్ము కాస్తున్నావంటూ తనను గొట్టుముక్కల సుధాకర్ అనే వ్యక్తి తిట్టినట్లు చెప్పారు. వైసీపీపై సుధాకర్ ద్వేషపూరితంగా ఉన్నాడని, తన భార్య ముందే తనను దూషించాడని చెప్పారు. సుధాకర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన తెలుగు దేశం పార్టీ వ్యక్తి అని తెలిపారు. మద్యం మత్తులో మాట్లాడాడని అన్నారు. ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయడానికి బార్ కోడ్ తయారు చేసిన వ్యక్తి అని ఆరోపించారు. తన మీద దౌర్జన్యం చేయడమే కాకుండా, టీడీపీ కావాలనే సోషల్ మీడియాలో గొడవకు సంబంధించిన వీడియోను వైరల్ చేసిందన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దయచేసి ఎవరూ దీన్ని నమ్మవద్దని కోరారు.
