Tirumala Electric Buses: త్వరలో తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రయోగాత్మకంగా పరిశీలించిన అధికారులు
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సుకు సంబంధించిన ట్రయల్ రన్ను అధికారులు ప్రయోగాత్మకంగా నిర్వహించారు. బస్సు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
- Narender Thiru
- Published On : September 19, 2022 / 03:50 PM IST
Tirumala Electric Buses: తిరుమల ఘాట్ రోడ్డులో భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ బస్సును అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఓలెక్ట్రా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సును ఘాట్ రోడ్డులో ట్రయల్ రన్ నిర్వహించారు.
కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ రవి వర్మ, తిరుపతి జిల్లా ప్రజా రవాణా అధికారి చంగల్ రెడ్డి, తిరుపతి డిపో మేనేజర్ పి.విశ్వనాథ్తోపాటు పలువురు అధికారులు ఈ ట్రయల్ రన్ పరిశీలించారు. ఎలక్ట్రిక్ బస్సు ఘాట్ రోడ్డులో ఎలా పనిచేస్తుంది అనే అంశాన్ని స్వయంగా తెలుసుకున్నారు. కాగా, బస్సు పనితీరు ఘాట్ రోడ్డులో సంతృప్తికరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రయాణించవచ్చన్నారు. తిరుమల-తిరుపతి మధ్య ఈ నెలాఖరులోపు 10 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.
Bone-chilling video: అమానుషం.. కుక్కను కారుకు కట్టుకుని ఈడ్చుకెళ్లిన డాక్టర్.. వీడియో వైరల్
అలాగే డిసెంబర్ చివరి నాటికి మొత్తం 50 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభమవుతాయని తెలిపారు. దీనికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి నుంచి ఇతర ప్రాంతాలకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడపబోతున్నట్లు వెల్లడించారు. తిరుపతి జిల్లాకు మొత్తం 100 విద్యుత్ బస్సులు కేటాయించారు. అద్దె ప్రాతిపదికన ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని, వీటి ఆపరేటింగ్, మెయింటెనెన్స్ బస్సు తయారీ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతాయని అధికారులు చెప్పారు.
