Perni Nani Slams Ktr
Perni Nani Slams KTR : ఏపీలో మౌలిక వసతుల గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాకరేపాయి. కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ నేతలు ఘాటుగా బదులిస్తున్నారు. డేట్, టైమ్ చెప్పు కేటీఆర్.. ఏపీ మొత్తం తిప్పి చూపిస్తా అని ఓ మంత్రి అంటే.. నాలుగు కాదు 400 బస్సుల్లో ఏపీకి వచ్చి చూడండి అని మరో మంత్రి సవాల్ విసిరారు.
తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై మాజీమంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ నోటి తొందర తగ్గించుకుంటే మంచిదని పేర్ని నాని హితవు పలికారు. కరోనా సమయంలో జనం తమ ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన విషయం గుర్తు లేదా? అని కేటీఆర్ ను ప్రశ్నించారు పేర్ని నాని. కేసీఆర్, కేటీఆర్ చెప్పేవన్నీ కేవలం మాటలే అని విమర్శించారు. అదే జగన్ ఏదైనా చెప్పారంటే, అది చేసి తీరుతారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. జగన్ మా సీఎం అయితే బాగుండు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని పేర్నినాని అన్నారు.(Perni Nani Slams KTR)
Peddireddy Counter To KTR : ఓట్ల కోసమే ఏపీపై విమర్శలు-కేటీఆర్కు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్
”కేటీఆర్ నోటి తొందర తగ్గించుకుంటే మంచిది. కరోనా టైమ్ లో ఎన్ని వేల మంది ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏపీలో వైద్యం చేయించుకోవడానికి లేదా ప్రాణాలు నిలుపుకోవడానికి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి పరిగెత్తుకొచ్చిన సంఘటనలు, ఆ రోజులు కేటీఆర్ ఒకసారి నెమరేసుకోవాలి. తెలంగాణ ప్రజలందరూ జగన్ మా ముఖ్యమంత్రి అయితే బాగుండు లేదా మన ఆంధ్రా వెళ్లిపోతే బాగుండు అని అనేక మంది పేద మధ్య తరగతి వర్గాలు లక్షల మంది రోజూ మననం చేసుకుంటున్న సంగతిని కేటీఆర్ ఒకసారి తెలుసుకుంటే అర్థవంతంగా ఉంటుంది” అని పేర్ని నాని అన్నారు.
కేటీఆర్ ఏమన్నారంటే..
ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతులు సరిగా లేదు. ఏపీలో కరెంట్ సరిగా లేదని, నీళ్లు కూడా లేవని, అభివృద్ధి జరగడం లేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తన మిత్రులు తనతో స్వయంగా చెప్పారని అన్నారు.(Perni Nani Slams KTR)
KTR Comments : డేట్, టైమ్ చెప్పు కేటీఆర్!.. ఏపీ మొత్తం తిప్పి చూపిస్తా
”ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు. నీళ్లు లేవు. రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి. ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన నా మిత్రులు ఈ విషయాన్ని నాతో చెప్పారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారు. బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్వాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయి. అదే తెలంగాణ విషయానికి వస్తే.. చాలా ప్రశాంతమైన రాష్ట్రం. దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైంది. నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతాం. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి” అని కేటీఆర్ అన్నారు. ఏపీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపాయి.