Narayana quash petition : ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన మాజీ మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి అసైన్డ్ల్యాండ్ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
- bheemraj
- Published On : March 18, 2021 / 06:10 PM IST
Former Minister Narayana Has Filed A Quash Petition In The Ap High Court1
Former minister Narayana quash petition : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి అసైన్డ్ల్యాండ్ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులిచ్చిన సీఐఐ అధికారులు… తన నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేయడం చట్టవిరుద్ధమని నారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టాలని హైకోర్టును కోరారు. అయితే హైకోర్టు మాత్రం… నారాయణ వేసిన క్వాష్ పిటిషన్ను రేపు ఉదయం విచారిస్తామని చెప్పింది.
ఏపీ సీఐడీ నిన్న నారాయణకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నోటీసులను సీఐడీ అధికారులు అందించారు. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ నోటీసులు ఇచ్చింది. నారాయణ అందుబాటులో లేకపోవడంతో భార్య రమాదేవికి నోటీసులు అందజేశారు. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
నోటీసుల్లో నారాయణను ఏ-2గా పేర్కొన్నారు. చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్ల కింద నారాయణపై కూడా కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరుకాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐడీ అధికారులు హెచ్చరించారు. విచారణకు హాజరుకాకపోతే సెక్షన్ 41ఏ(3)(4) కింద నారాయణను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిపారు.
