Alla Ramakrishna Reddy
Alla Ramakrishna Reddy : చంద్రబాబు నాయుడు, లింగమనేని, నారాయణతోపాటు నారా లోకేశ్కు శిక్ష తప్పదు. మీపై ఉన్న కేసుల్లో ఫిర్యాదుదారులను భయపెట్టి ఒక్కొక్కటి కొట్టేయిస్తున్నారు. నేను మాత్రం వదలను.. భయపడను. నన్ను ఎలా భయపెట్టారో సందర్భాన్ని బట్టి చెబుతా. ఎవరెవరిని నా దగ్గరికి పంపి నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారో అన్ని చెబుతానని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Also Read : Mother Kills Daughter : ఏపీలో దారుణం.. ప్రియుడి మోజులోపడి కన్న కూతురునే కడతేర్చిన తల్లి
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏసీబీ కోర్టు, సీఐడీ నాకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు, లింగమనేని రమేష్, మంత్రి నారాయణ పక్కా ప్లాన్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి చేశారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రకటనకు ముందే లింగమనేని రమేష్ 350 ఎకరాలు కొనుగోలు చేశారు. భూముల విలువలు పెంచుకోవడానికి ముందుగా కొనుగోలు చేసిన చోట నుండి ఇన్నర్ రింగ్ రోడ్డు మార్చారు. లింగమనేనికి చెందిన కొన్ని భూములకు దగ్గరగా, కొన్ని భూములకు ఆనుకుని ఉండేలా ప్లాన్ చేశారని, ఈ ప్లాన్ అనుకూలంగా మార్చడంతో హెరిటేజ్కి 18ఎకరాలు ఇచ్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
కోట్లలో విలువ ఉన్న భూమిని 8 లక్షలకు అమ్మారు. పవన్ కల్యాణ్కి కూడా 2.5 ఎకరాలు భూమిని 8 లక్షలకు అమ్మారు. కోట్లలో విలువ ఉన్న భూములను కేవలం 8 లక్షలకే ఎందుకు ఇచ్చారని ఆళ్ల ప్రశ్నించారు. అత్యంత విలువైన కరకట్ట పైన ఉన్న ఇంటిని చంద్రబాబుకి ఉచితంగా ఇచ్చారు. ఈ కేసులో లింగమనేని, చంద్రబాబు, మంత్రి నారాయణ అందరూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో 18వ నిందితుడిగా నారా లోకేష్ కూడా ఉన్నారు. ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈరోజు కేసు ముసెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
అసలు కేసే తప్పుడు కేసు అని కోర్టులో అప్పీల్ కి వెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులే ఇప్పుడు తప్పుడు కేసు అంటున్నారు. అనిత హోంమంత్రి అయినా లా అండ్ ఆర్డర్ మొత్తం చంద్రబాబు చేతిలో ఉంది. ఎస్పీ స్థాయి నుండి డీజీపీ వరకూ చంద్రబాబు ఆధీనంలోనే ఉన్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులను అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కేసులు క్లోస్ చేసేసుకుంటున్నారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి చట్టాలకు విరుద్ధంగా కేసులు మూసేస్తున్నారు. ఇది చిన్న కేసు కాదు.. 2500 కోట్ల అవినీతి జరిగింది.. మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్ అని క్లోస్ చెయ్యడం అన్యాయం. న్యాయ స్థానాల్లో నా పోరాటం కొనసాగిస్తా. ఏ ఆధారంతో సీఐడీ అధికారులు ఈ కేసును మూసేస్తున్నారు..? నాకు వివరాలు ఇవ్వాలి. 27 తేదీన ఏసీబీ కోర్టుకి హాజరవుతా, నాకు న్యాయం జరగకపోతే హై కోర్టుకి వెళ్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
తప్పు చెయ్యకపోతే మీరు లీగల్గా నిరూపించుకోండి. అన్యాయంగా అధికారం అడ్డుపెట్టుకుని క్లోస్ చేసేస్తారా..? డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఐడీ చీప్ రవి శంకర్, ఆయఎన్నార్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మీ ఇద్దరిపై కన్నువేసి ఉంచాను.. ఎక్కడెక్కడ అన్యాయాలు చేస్తున్నారో చూస్తున్న. రెండేళ్లలో మీ ఇద్దరూ ఎక్కడెక్కడ అవినీతి ఆస్తులు పోగేశారో నాదగ్గర ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఈ ఇద్దరి అధికారుల అవినీతి చిట్టా బయటపెడతానంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.
2024 లో నేను పోటీ చెయ్యలేదు. 2029 లో పోటీ చేస్తాను. ఎమ్మెల్యే గానో ఎంపీ గానో అవుతాను. మీరు రిటైర్ అయితే మళ్లీ ఐపీఎస్లు అవ్వలేరు. నేను మళ్లీ ఎమ్మెల్యే లేదంటే ఎంపీ అవుతాను. చట్టం ముందు నినబెడతా అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.