ఓటింగ్ డే : ఏపీలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు
- madhu
- Published On : February 21, 2021 / 06:41 AM IST
panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. చివరి నాలుగో దశ ఎన్నికలు 2021, ఫిబ్రవరి 21వ తేదీ ఆదివారం జరుగుతోంది. ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మొత్తం 13 జిల్లాలోని 161 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2 వేల 743 సర్పంచ్ స్థానాలకు 7 వేల 475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 22 వేల 423 వార్డు మెంబర్ స్థానాలకు 52 వేల 700 మంది రంగంలో ఉన్నారు. నాలుగో విడతలో ఓటు వేసే వారి సంఖ్య 67 లక్షల 75 వేల 226 గా ఉంది. 28 వేల 995 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. 3,299 సర్పంచ్ స్థానాలకు 554 ఏకగ్రీవం అయ్యాయి. 33,435 వార్డులకు 10,921 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. సున్నితమైన ప్రాంతాలపై ఎస్ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
