Pawan Kalyan
Gossip Garage : పదేళ్ల పోరాటం.. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని చరిత్రాత్మక విజయం సాధించిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న పార్టీ అతిపెద్ద వేడుక. ఆ వేదిక మీద జనసేనాని ఇచ్చే స్పీచ్ మీద ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. తన నియోజకవర్గం పిఠాపురం వేదికగా పార్టీ ప్లీనరీని ఆర్గనైజ్ చేస్తున్న పవన్..క్యాడర్, తన అభిమానులను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారనే హైప్ క్రియేట్ అవుతోంది. పార్టీ అధ్యక్షుడిగా, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కీలక ప్రకటనలు చేస్తారని టాక్ వినిపిస్తోంది. ప్లీనరీలో పవన్ ఏం మాట్లాబోతున్నారు?
2014 మార్చి 14న ఆవిర్భావం. సరిగ్గా పదేళ్ల తర్వాత 2024 ఎన్నికల ఫలితాలు జనసేన చరిత్రలో ఓ సెన్సేషన్. అలాంటి అద్భుత విజయం అందుకున్న తర్వాత..ఒక్క సీటు నుంచి పోటీ చేసిన అన్ని సీట్లు గెలుచుకుని నిలబడిన తర్వాత..పార్టీ అతిపెద్ద పండుగ చేసుకుంటోంది జనసేన. పిఠాపురం వేదికగా పార్టీ ఆవిర్భావ వేడుకలకు గ్రాండ్గా నిర్వహిస్తున్నారు.
మార్చి 14 శుక్రవారం చిత్రాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జనసేన కార్యకర్తలు, లీడర్లు, పవన్ అభిమానులు హాజరుకానున్నారు. అయితే ప్లీనరీలో పవన్ మాట్లాడే స్పీచ్పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. సేనాని చాలా రోజుల తర్వాత పబ్లిక్ మీటింగ్ను అడ్రస్ చేయబోతున్నారు. పైగా పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దీంతో ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి అయితే కొనసాగుతోంది.
Also Read : విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారడం ఖాయమా? జగన్తో రాజీ ముచ్చటే లేదనడానికి రీజనేంటి?
విపక్షంలో ఉన్నప్పుడు జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతీ ఏటా గ్రాండ్గా నిర్వహించే వారు పవన్. అపోజిషన్లో ఉన్నప్పుడు పవన్ చేసే ప్రసంగాలు అభిమానులను ఉర్రూతలూగించేవి. అంతేకాదు తన స్పీచ్లో పవన్ రాజకీయ వ్యూహాలు కూడా అందరికీ తెలిసేవి. అలా పవన్ హింట్స్ ఇచ్చేవారని కూడా చెబుతారు. అయితే ఇప్పుడు తొలిసారి జనసేన అధికారంలో ఉండటంతో ఆవిర్భావ దినోత్సాన్ని కాస్త ప్లీనరీగా మార్చి పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నారు.
ప్లీనరీ వేదికగా పవన్ ఏం మాట్లాడుబోతున్నారు. ఏయే అంశాలపై ఫోకస్ చేయబోతున్నారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడు అధికారంలో ఉండటంతో పవన్ ఎవరికి టార్గెట్గా విమర్శలు సంధిస్తారనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. అనుకున్నట్లుగా వైసీపీని ఓడించారు. ఇప్పుడు కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇచ్చే స్పీచ్ మీద ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
పొత్తు, సీఎం పదవిపై ప్లీనరీ వేదికగా మరింత స్పష్టత ఇస్తారా?
జనసేన ఫ్యూచర్ పాలిటిక్స్పై క్లారిటీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతేకాదు తమ అభిమాన నాయకుడు సీఎం కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ ఏమో ఇంకో పది, పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని..పొత్తుతోనే ముందుకు వెళ్తామని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. పొత్తు..సీఎం పదవిపై ప్లీనరీ వేదికగా పవన్ మరింత స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు.
Also Read : చివరికి చిక్కీ, కోడిగుడ్లపైనా ఆయన ఫోటోలే.. జగన్ టార్గెట్గా లోకేశ్ మాస్ ర్యాగింగ్
బీజేపీతో సంబంధాలు, హిందుత్వ ఎజెండాపై కూడా తన స్టాండ్ ఏంటో చెప్పే అవకాశం ఉంది. అక్కడక్కడ జనసేన, టీడీపీ నేతల మధ్య గ్యాప్ ఉండటం వంటి అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. పవనే సీఎం అంటూ జనసేన నేతలు స్టేట్ మెంట్లు ఇవ్వడంపై కూడా జనసేనాని క్యాడర్, లీడర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తారని టాక్ వినిపిస్తోంది.
ప్లీనరీ వేదికగా వైసీపీని కార్నర్ చేసే అవకాశం..
ప్లీనరీ వేదికగా పవన్ వైసీపీని కార్నర్ చేసే అవకాశం ఉందంటున్నారు. కాకినాడ పోర్ట్ వ్యవహారం, బియ్యం దందా, వివేకా హత్య వంటి అంశాలను ప్రస్తావించడంతో పాటు..తాము అధికారంలోకి వచ్చాక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టామో..ప్రజలకు మేలు చేసేందుకు ఏమేం చేస్తున్నామో చెప్పబోతున్నారట. త్వరలో నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోనుండటంతో..పార్టీలో ఆయన రోల్ను మరింత యాక్టివ్ చేస్తారని అంటున్నారు. ఇక జనసేనలో చేరికలకు సంబంధించి స్పష్టత ఇస్తారని చర్చ నడుస్తోంది.
పాలిటిక్స్, భవిష్యత్ లక్ష్యాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే..సినీ జర్నీపై పవన్ ఎలాంటి స్పష్టత ఇస్తారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఓవైపు పాలిటిక్స్..ఇంకోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తానని చెప్తారా లేక ఇక యాక్టింగ్కు గుడ్బై చెప్తారా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. పవన్ ఇప్పటికే మూడు సినిమాలు కమిట్ అయి ఉన్నారు.
అందులో ఓజీ, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఆ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన సినిమాల విడుదల, ఫ్యూచర్ ప్రాజెక్టులపై కూడా సేనాని క్లారిటీ ఇస్తారని అంటున్నారు. మొత్తం మీద ఈ పదేళ్లలో పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంటూ పార్టీ సాధించిన విజయాలను..భవిష్యత్ లక్ష్యాలపై డిస్కస్ చేసే అవకాశం ఉంది. ప్లీనరీలో పవన్ స్పీచ్ ఎలా ఉంటుందో చూడాలి.