MLC Nagababu: మెగా బ్రదర్‌కూ తప్పని అవమానాలు..? నాగబాబుకు జరిగిన అవమానమేంటి? దీని వెనుకున్నది వారేనా?

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టు కోసం నాగబాబుని వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయించే ఆలోచనలో జనసేన అధినేత పవన్‌ ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటినుంచే గ్రౌండ్‌ ప్రిపేర్ చేసుకునే పనిలో బిజీగా ఉన్న నాగబాబుకు..ప్రోటోకాల్‌ ఇష్యూస్, అధికార యంత్రాంగం తీరు అసంతృప్తి కలిగించాయట.

  • Updated on- April 28, 2026 / 10:16 PM IST
  • ఎచ్చెర్లలో యాక్టివిటీ స్పీడప్‌ చేస్తున్న నాగబాబు
  • వరుస పర్యటనలతో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే ప్లాన్
  • మెగాబ్రదర్‌కు అధికారులు ప్రోటోకాల్‌ పాటించట్లేదా?
  • నాగబాబు మండలి ఛైర్మన్‌ ఆఫీస్‌కు కంప్లైంట్‌ చేశారా?

MLC Nagababu: ఉత్తరాంధ్రలోని ఓ అసెంబ్లీ సీటుపై జనసేన ఎమ్మెల్సీ ఫోకస్ పెట్టారు. వరుస పెట్టి ఆ నియోజకవర్గంలో పర్యటించారు కూడా. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయనకు..ప్రోటోకాల్‌ విషయంలో ఇష్యూస్‌ ఫేస్ చేయాల్సి వచ్చిందట. ఇంతకు ఆ సీనియర్ నేతకు జరిగిన అవమానమేంటి? ఆయన అంతగా ఎందుకు ఫీలైనట్లు? జనసేనలో కీలన నాయకుడిగా ఉండి కూడా ఏకంగా మండలి సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?

వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనుకుంటున్న ఎమ్మెల్సీ నాగబాబు..శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో కాపులు ఉండటమే అందుకు కారణమన్న చర్చ ఉంది. అయితే ఎచ్చెర్లలో వరుసగా పర్యటనలు చేస్తూ..ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్న నాగబాబుకు అనుకోని చిక్కులు వచ్చి పడుతున్నాయట. కూటమిలోని మిగతా పార్టీల నుంచి హార్ట్ ఫుల్‌గా మద్దతు లభించట్లేదట.

ప్రోటోకాల్‌ ఉల్లంఘనల వెనుక మిత్రపక్షాల హస్తం?

అటు అధికార యంత్రాంగం కూడా ఆయన విషయంలో ప్రోటోకాల్ పాటించట్లేదట. అధికారిక కార్యక్రమాలకు నాగబాబుకు ఇన్విటేషన్‌ పంపకపోవడంపై జనసేన క్యాడర్ రగిలిపోతోందట. అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానించకపోవడంపై కూడా నాగబాబు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారట. ముఖ్యంగా అరసవల్లి రథసప్తమి వేడుకలకు, సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న తనకు కనీసం ఆహ్వానం పంపకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడంతో విస్తుపోయారట నాగబాబు. ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని ఎంచుకున్న నాగబాబును అధికార యంత్రాంగం విస్మరించడం వెనుక మిత్రపక్షాల్లోని కీలక నేతల ఒత్తడి ఉందనే ఆరోపణలు చేస్తున్నారు జనసేన నేతలు.

జనసేనలో నెంబర్‌-2 నేతకు ప్రోటోకాల్‌ ఇష్యూసా?

ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ది, అధికారిక కార్యక్రమాల్లో తనకు ప్రోటోకాల్ కల్పించకపోవడంపై నాగబాబు శాసన మండలి ఆఫీస్‌కు కంప్లైట్‌ చేశారట. శాసన మండలి సెక్రటరీ జనరల్‌ స్పందించి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనల్లో ప్రోటోకాల్‌ పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రోటోకాల్‌ నిబంధనలు పాటించేలా..అధికారిక కార్యక్రమాలకు నాగబాబుకు ఆహ్వానం పలికేలా ఆదేశాలు అందాయట. అయితే జనసేన చీఫ్ సోదరుడు..పైగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ..జనసేనలో నెంబర్‌-2గా చెప్పబడుతున్న నాగబాబుకు ప్రోటోకాల్‌ ఇష్యూస్ రావడం ఏంటి.? ఆయన శాసనమండలి సెక్రటరీ జనరల్‌కు కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

అయితే ఎచ్చెర్ల టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు ఇలాకా. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని కళా అనుకుంటే టీడీపీ అధిష్టానం ఆయనను చీపురుపల్లికి పంపించింది. అయితే 2029లో తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడుకు ఎచ్చెర్ల సీటు కోరే ఆలోచనలో కళా వెంకట్రావు ఉన్నట్లు తెలుస్తోంది. విజయనగరం ఎంపీగా ఉన్న కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఎచ్చెర్లకు చెందిన వారే. ఆయన కూడా 2029లో ఇక్కడ నుంచి పోటీకి ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నాగబాబు పర్యటనలతో ఎచ్చెర్ల పాలిటిక్స్‌పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టు కోసం రంగంలోకి నాగబాబు..!

అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టు కోసం నాగబాబుని వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయించే ఆలోచనలో జనసేన అధినేత పవన్‌ ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటినుంచే గ్రౌండ్‌ ప్రిపేర్ చేసుకునే పనిలో బిజీగా ఉన్న నాగబాబుకు..ప్రోటోకాల్‌ ఇష్యూస్, అధికార యంత్రాంగం తీరు అసంతృప్తి కలిగించాయట. రానున్న రోజుల్లో మరింత యాక్టివ్‌ అయి..వారంలో మూడు నాలుగు రోజులు ఎచ్చెర్లలోనే మకాం వేసేలా ప్లాన్ చేస్తున్నారట నాగబాబు.

Also Read: మళ్లీ న్యూస్‌ హెడ్‌లైన్‌గా కల్తీ నెయ్యి ఎపిసోడ్.. నెల్లూరు ఏసీబీ కోర్టు ఎంట్రీ.. ఏం తేల్చనుంది?