Raghu Rama Krishna Raju: ఒకే ఒక్క ఇష్యూతో పరిస్థితులన్నీ పాజిటివ్‌గా మారిపోయాయా? రాముడి సాక్షిగా RRR గ్రాఫ్ పెరుగుతోందా?

రఘురామను ఎదుర్కొనే ఉద్దండుడు వైసీపీకి ఉండి నియోజకవర్గంలో దొరుకుతాడా.. లేదా అనే చర్చ కూడా జరుగుతోందట. టీడీపీ జెండా ఎగురవేసిన రఘురామను ఢీకొట్టే బలమైన నాయకుడి కోసం వైసీపీ అన్వేషిస్తోందనే టాక్ వినబడుతుంది.

  • Published On : April 4, 2026 / 12:29 AM IST
  • కూటమిలో రఘురామపై నెగెటివిటీకి చెక్ పడ్డట్లేనా?
  • ఉండి పాలిటిక్స్‌లో రఘురామ దూకుడు పెంచుతున్నారా?
  • ఆయనకు అంతగా మైలేజ్‌ తెచ్చిపెడుతున్న అంశమేంటి?

Raghu Rama Krishna Raju: మొన్నటివరకు అక్కడ టీడీపీలో కుస్తీ. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, పైగా డిప్యూటీ స్పీకర్‌పై సొంత పార్టీ నేతల అసంతృప్తి గళం. పైగా జనసేన నేతలు కూడా ఆయన తీరుపై ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడా నియోజకవర్గంలో సీన్ మారిందట. ఒకే ఒక్క ఇష్యూతో..పరిస్థితులన్నీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు పాజిటివ్‌గా మారిపోతున్నాయట. ఇంతకు ఎవరా నేత? ఆయనకు అంతగా మైలేజ్‌ తెచ్చిపెడుతున్న అంశమేంటి?

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆకివీడు పెదపేటలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రామమందిరం దగ్గర జరిగిన వివాదం రాజకీయంగా పెను దుమారం రేపింది. ఈ ఇష్యూ ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పొలిటికల్‌గా దూకుడు పెంచారు. పెదపేటలో రామమందిరం పునర్నిర్మాణం చేపట్టేందుకు కంకణం కట్టుకున్నారు. అయితే రామాలయం అంశంలో జరుగుతున్న చర్చ.. రఘురామ కృష్ణరాజు గ్రాఫ్‌ను అమాంతంగా పెంచేస్తోందట. ఆలయ నిర్మాణాన్ని ఆపేది లేదని రఘురామ స్పష్టం చేయడంతో రాజకీయంగా ఆయన పట్టు మరింత పెరిగినట్లేనన్న డిస్కషన్‌ ఉండిలో ఇంట్రెస్టింగ్‌గా మారింది.

రఘురామకు వ్యతిరేకంగా టీడీపీలో నిరసన గళం..

మొన్నటివరకు ఉండి టీడీపీలో రఘురామకు వ్యతిరేకంగా పలువురు నేతలు నిరసన గళం వినిపించారు. సీనియర్ లీడర్లు తమను రఘురామ పట్టించుకోవడం లేదని..తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకుని..వలస నేతలకు పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇక భీమవరంలో పేకాట శిబిరం విషయంలో జనసేన నేతలతో రఘురామకు డైలాగ్ వార్ నడిచింది. భీమవరం పేకాట శిబిరాల నిర్వహణ అంశంలో డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్‌ విచారణకు ఆదేశించడం..డీఎస్పీ మంచి వాడంటూ రఘురామ సర్టిఫై చేయడం అప్పట్లో జన సైనికులకు కోపం తెప్పించింది.

దీంతో ఉండిలో రఘురామ తీరుపై సొంత పార్టీ టీడీపీ నేతలతో పాటు జనసేన లీడర్లు కూడా హ్యపీగా లేరన్న టాక్ నడిచింది. కానీ ఒకే ఒక్క అంశం రఘురామపై పాజిటివిటీని పెంచేస్తోందట. రామాలయం పునర్నిర్మాణం అంశం లోకల్‌గా ఆయన పట్టు పెరిగేలా ఉందట. టీడీపీతో పాటు లోకల్ జనసేన లీడర్లు కూడా రఘురామకు జై కొట్టేలా పరిణామాలు మారుతూ వస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక రఘురామను ఎదుర్కొనే ఉద్దండుడు వైసీపీకి ఉండి నియోజకవర్గంలో దొరుకుతాడా.. లేదా అనే చర్చ కూడా జరుగుతోందట. టీడీపీ జెండా ఎగురవేసిన రఘురామను ఢీకొట్టే బలమైన నాయకుడి కోసం వైసీపీ అన్వేషిస్తోందనే టాక్ వినబడుతుంది. మరోవైపు రఘురామ తన వాగ్ధాటితోనూ, అభివృద్ధి కార్యక్రమాలతోనూ నియోజకవర్గంలో తనకంటూ ఒక బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారట. గత ఎన్నికల టైమ్‌లో ఉండి కంచుకోటను చేజిక్కించుకోవడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

రఘురామ నిర్ణయాలతో పరోక్షంగా వైసీపీని కోలుకోలేని స్థితికి..

రఘురామకు ఉన్న జనాదరణ, దూకుడును తట్టుకునే స్థాయిలో నిలబడగలిగే బలమైన నేత వైసీపీలో ప్రస్తుతం కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. గత ఐదేళ్ల పోరాటం తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టిన రఘురామ, ఇప్పుడు అధికారిక హోదాలో విమర్శలకు మరింత పదును పెడతున్నారు. ఉండిలో కాలువల తవ్వకం, ప్లాస్టిక్ రహిత కార్యక్రమాల వంటి వినూత్న పనులతో ప్రజలకు మరింత చేరువవుతున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంపై ఆయన చేసిన వరుస విమర్శలు, ఇప్పుడు అభివృద్ధి మంత్రం ఉండిలో వైసీపీ క్యాడర్‌ను డైలమాలో పడేశాయట. డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామ తీసుకుంటున్న నిర్ణయాలు పరోక్షంగా వైసీపీని కోలుకోలేని స్థితికి నెడుతున్నాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి

టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉండిలో నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను వాడుకుని గేమ్‌ ఆడాలని వైసీపీ ప్రయత్నించి సక్సెస్ కాలేదన్న చర్చ ఉంది. ఇప్పుడు రామాలయం ఇష్యూను అడ్డం పెట్టుకొని రఘురామ గ్రాఫ్‌ను తగ్గించే ప్రయత్నం చేసి మరోసారి విఫలమైందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. రఘురామ చాకచక్యంతో అసమ్మతి నేతలను దారికి తెచ్చుకుంటూ, వైసీపీ ఆడుతున్న గేమ్‌ను తిప్పికొడుతున్నారట. ఆకివీడు రామాలయ ఘటనతో రఘురామ కృష్ణరాజుకు సానుభూతి పెరగడంతో పాటు, ఉండిలో ఆయనకు బలమైన మద్దతు లభించేలా ఉందట.

అయితే కొంతమంది దళిత సంఘాల నేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు చేస్తున్న విమర్శలు, సవాళ్లను తిప్పికొడుతూ..వారికి ప్రతి సవాల్ చేస్తూ రఘురామకృష్ణరాజు మరింత దూకుడు పెంచుతున్నారట. సొంత నిధులతో అయినా రామ మందిరం పునర్నిర్మిస్తానని చెప్పడంతో పాటు..ఇదే సందర్భంలో డిజైన్ కూడా సిద్ధం చేసి రిలీజ్ చేశారు రఘురామకృష్ణరాజు. మొత్తానికి రాముడు సాక్షిగా శ్రీరామనవమి రోజు జరిగిన ఘటనతో రఘురామకృష్ణరాజు గ్రాఫ్ ఉండి నియోజకవర్గంలో పెరగడంతో పాటు కూటమి పార్టీల మద్దతు కూడా కూడగట్టుకోలిగారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: లోకల్‌ ఫైట్‌.. టీడీపీ ఫైవ్ పాయింట్‌ ఫార్ములా.. చంద్రబాబు మాస్టర్ ప్లానేంటి?