×
Ad

Ysrcp: పోటీ చేసేదెక్కడ? డైలమాలో వైసీపీ కీలక నేతలు..! జగన్ నిర్ణయం కోసం ఎదురుచూపులు

గత ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడ పోటీ చేశాం. అప్పుడు అధికారం ఉంది గెలుస్తామనే ధీమా ఉండేది. ఇప్పుడు అపోజిషన్‌లో ఉన్నామ్. అసలే పరిస్థితులు బాలేవు. పైగా ప్రతిపక్షంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోయింది.

  • Published On : March 10, 2026 / 09:55 PM IST

Ysrcp Leaders Representative Image (Image Credit To Original Source)

 

  • వచ్చే ఎన్నికల్లో వైసీపీ కీలక నేతలు పోటీ చేసేదెక్కడ.?
  • నియోజకవర్గంలో రథసారధి లేక క్యాడర్‌ అయోమయం
  • పోటీ చేసే నియోజకవర్గం ఏంటో తెలియక డైలమాలో లీడర్లు
  • నియోజకవర్గాల ఇంచార్జ్‌ల నియామకంపై ఆలస్యమెందుకు?

 

Ysrcp: ఇక్కడున్న వాళ్లను అక్కడకు. అక్కడున్న వాళ్లను ఇక్కడికి. కొందరిని అయితే జిల్లాలు దాటించేసి మరీ పోటీ చేయించారు. ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ కాలేదు. జరగాల్సిన దాని కంటే ఎక్కువే నష్టపోయారు. ప్రతిపక్షంలోకి వచ్చి 20 నెలలు అయిపోయింది. ఇప్పటికీ చాలాచోట్ల వైసీపీకి ఇంచార్జ్‌లు లేరు. చెప్పుకోదగ్గ నేతలకు పోటీ చేసే నియోజకవర్గం ఏంటో క్లారిటీ లేదు. నడిపించే నాయకుడు లేక క్యాడర్‌ డైలమాలో ఉంటే..వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తామో తెలియక లీడర్లు పరేషాన్‌లో ఉన్నారట.

20 నెలలుగా అధికారం కోల్పోయామనే బాధ వెంటాడుతూనే ఉంది. మళ్లీ పవర్‌లోకి వస్తామా? ఫీల్డ్‌లోకి దిగి పనిచేస్తే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో? లేదో? అనే డైలమా కంటిన్యూ అవుతోంది. ఓవైపు వైసీపీ లీడర్లు..క్యాడర్..డైలమాలో ఉంటే..కొన్ని చోట్ల టికెట్ ఫైట్‌ నడుస్తుంది. మరికొన్ని చోట్ల నడిపించే నాయకుడు లేక క్యాడర్ అయోమయంలో పడిపోయిందట. ఇక కొందరు ముఖ్యనేతల పరిస్థితి ఇంకా గమ్మత్తుగా ఉందట. పేరు గొప్పగా ఉన్నా చెప్పుకోవడానికి తమకంటూ ఓ నియోజకవర్గం లేకుండా పోయిందని మధన పడుతున్నారట.

తమకంటూ ఓ నియోజకవర్గం లేకుండా పోయిందన్న ఆవేదన..

వైసీపీకి చెందిన పలువురు యువనేతలు అయితే అధినేత నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారట. గత ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడ పోటీ చేశాం. అప్పుడు అధికారం ఉంది గెలుస్తామనే ధీమా ఉండేది. ఇప్పుడు అపోజిషన్‌లో ఉన్నామ్. అసలే పరిస్థితులు బాలేవు. పైగా ప్రతిపక్షంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోయింది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైమ్‌ ఉన్నా జమిలి ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే త్వరగా ఏదో ఒక నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా నియమిస్తే వెళ్లి అక్కడ పనిచేసుకుంటామంటూ అర్జీలు పెట్టుకుంటున్నారు పలువురు ఫ్యాన్ పార్టీ లీడర్లు. అప్పటిలోగా రాజకీయంగా అడుగు తీసి అడుగు వేయాలంటే ఆలోచించే పరిస్థితిని ఫేస్ చేస్తున్నారట. తమకంటూ ఓ నియోజకవర్గం లేకుండా పోయిందన్న భావనలో ఉన్నారట.

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ యువ నాయకుడిగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. కూటమిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ..బలమైన కౌంటర్ ఇస్తూ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. పైగా కమ్మ సామాజికవర్గంలో అంతో ఇంతో మద్దతున్న నేత. కానీ వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచే పోటీ చేస్తారు? అంటే..ఇప్పటికైతే నో క్లారిటీ. దీంతో ఆయన ఎటువైపు అడుగు వేయాలన్నది తేల్చుకోలేకపోతున్నారట. విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని కొంతసేపు..కాదు పెనమలూరు నియోజకవర్గం ఇస్తామని మరోసారి..మచిలీపట్నం నుంచి పోటీ చేయించే యోచన అంటూ ఇంకోసారి లీకులు ఇస్తుండటంతో దేవినేని అవినాష్ సందిగ్ధంలో పడ్డారట.

సైలెంట్ మోడ్ లో అనిల్ కుమార్ యాదవ్..

ఇక విజయవాడ పశ్చిమలో పోతిన వెంకట మహేష్, వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తారో తెలియని పరిస్థితి. అటు నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనను నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. కానీ ఆయన అక్కడ ఓడిపోయారు. దీంతో మళ్లీ తిరిగి తన సొంత నియోజకవర్గానికి వెళ్లాలనుకుంటున్నారు. కానీ అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అడాల ప్రభాకర్‌రెడ్డి మళ్లీ టికెట్ ఆశించే అవకాశం ఉందంటున్నారు. దీంతో తిరిగి సొంత సెగ్మెంట్‌ నుంచి పోటీ చేయడంపై అనిల్‌కుమార్‌ యాదవ్‌కు అధిష్టానం నుంచి అభయం దక్కలేదంటున్నారు. అటు గుడివాడ అమర్‌నాథ్‌ తనను గాజువాక ఇంచార్జ్‌గా నియమించడంపై అసంతృప్తిగా ఉన్నారట.

ఇలా గత ఎన్నికల్లో నియోజకవర్గాలు మార్చి అధిష్టానం మరో చోటు నుంచి పోటీ చేయించిన నేతలంతా పొలిటికల్ ఫ్యూచర్‌పై డైలమాలో ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై క్లారిటీ లేకపోవడంతో లైమ్‌లైట్‌లో ఉండేందుకు ఇష్టపడట్లేదట. ఏదో ఒక నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఇప్పటినుంచే పని చేసుకుంటూపోతేనే పట్టు సాధించే అవకాశం ఉంటుందని..లేకపోతే గత ఎన్నికల లాగా లాస్ట్‌ మూమెంట్‌లో నియోజకవర్గాలు మారిస్తే కష్టమే అంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది నేతలు జగన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారట. నియోజకవర్గ ఇంచార్జ్‌లు, కీలక నేతలు పోటీ చేసే స్థానాలపై వైసీపీ అధినేత ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారోనన్నది సస్పెన్స్‌గా మారింది.

Also Read: పవనే సీఎం కావాలి.. వైసీపీ నేతలు ఇలా కోరుకోవడం ఏంటి? అసలు ఫ్యాన్ పార్టీ స్ట్రాటజీ ఏంటి?