Mla Bendalam Ashok: వివాదాల్లో మిస్టర్ కూల్, హ్యాట్రిక్ టీడీపీ ఎమ్మెల్యే.. ఏంటా గొడవ, ఎలా చిక్కుకున్నారు?

స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వివాదాలు ఏంటి.. కుల సమస్యలు ఏంటి? అని పార్టీ సీనియర్లు పెదవి విరుస్తున్నారు.

  • Published On : March 30, 2026 / 09:52 PM IST

 

Mla Bendalam Ashok: సైలెంట్‌గా రాజకీయాలు చేసుకోవడం.. కూల్‌గా వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. ఆ తీరే ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేను చేసింది. అలాంటి నేత.. ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అయ్యారా.. ఆదివాసీల ఆగ్రహానికి గురవుతున్నారా.. అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా నాయకుడు.. ఏంటా నియోజకవర్గం. కాంట్రవర్సీల్లో ఎలా చిక్కుకున్నారు..

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి గేట్‌ వే ఆఫ్‌ ఏపీ అని పేరు. నేతలు ఎవరైనా.. పార్టీ ఏదైనా.. పాదయాత్రలు అంటే టక్కున గుర్తొచ్చే పేరు ఇచ్చాపురం. టీడీపీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్న నియోజకవర్గం అది. ఇక్కడి నుంచి సైకిల్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ కొట్టారు బెందాళం అశోక్‌. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌ పదవిలో కూడా ఉన్నారు. 2019లో జగన్ హవాను తట్టుకొని సైతం ఆయన గెలిచారు. కూల్ అండ్ సైలెంట్ రాజకీయాలు చేస్తారని ఆయనకు పేరు. ఎక్కువగా తన నియోజకవర్గానికే పరిమితం అవుతూ.. పాలిటిక్స్ నడిపిస్తూ ఉంటారు. సైలెన్స్‌కు కేరాఫ్‌గా ఉండే బెందాళం అశోక్.. ఒక్కసారి వయలెంట్‌గా మారడం.. ఇప్పుడు ఉమ్మడి సిక్కోలు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.

గిరిజన సంఘాల నేతలపై ఎమ్మెల్యే బూతుపురాణం..

గిరిజనులు, బెంతొరియాల మధ్య సాగుతున్న ఎస్టీ సర్టిఫికెట్ల వివాదంలో ఎంటర్ కావడంతో.. బెందాళం అశోక్ కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిపోయారు. తన నియోజకవర్గంలో 20వేలకు పైగా బెంతొరియా కులాలకు చెందిన వాళ్లు ఉన్నారని.. వారిని ఎస్టీల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు అశోక్‌. ఐతే దీన్ని వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాలు.. ఈ మధ్య అశోక్‌ను కలిశాయ్. ఐతే ఆ సమయంలో గిరిజన సంఘాల నేతలపై అశోక్ నోరు పారేసుకున్నారు. బూతు పురాణం అందుకున్నారు. దీంతో ఆయన తీరుపై గిరిజన సంఘాల నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రవర్తనను వ్యతిరేకిస్తూ పోరాటాలకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.

అశోక్‌ అలా వ్యవహరించి ఉండాల్సింది కాదు..

బెంతొరియాలను ఎస్టీల్లో చేర్చాలనే వ్యవహారం చుట్టూ శ్రీకాకుళం జిల్లాలో కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. దీనిపై అనేక ప్రభుత్వాలు కమిటీలు వేశాయని.. అసలు బెంతొరియాలు లేరని అవి తేల్చి చెప్పాయని.. దీంతో అప్పటి కలెక్టర్‌ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారని గిరిజన సంఘాల నేతలు అంటున్నారు. ఐతే ఎమ్మెల్యే అశోక్ మాత్రం ఓటు రాజకీయాలు చేస్తూ.. నకిలీ బెంతొరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే తీరుపై గిరిజన సంఘాల నేతల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక అటు సొంత పార్టీ నేతలు కూడా అశోక్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన నేతలతో ఆయన అలా వ్యవహరించి ఉండాల్సింది కాదని అంటున్నారు.

స్థానిక ఎన్నికల వేళ ఇలాంటి వివాదాలు ఏంటి..?

అశోక్ తీరు.. ఇప్పుడు జిల్లా పార్టీలో కొత్త చర్చకు కారణం అవుతోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రెండు లక్షలకు పైగా గిరిజనులు ఉన్నారని.. వారి మనోభావాలు దెబ్బతింటే పార్టీకి తీరని నష్టం అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇక అటు గిరిజన సంఘాలు మాత్రం తగ్గేదే లే అంటున్నాయ్‌. ఎమ్మెల్యే ప్రవర్తనపై ఎంతవరకైనా పోరాటానికి సిద్ధం అంటున్నాయ్‌. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వివాదాలు ఏంటి.. కుల సమస్యలు ఏంటి? అని పార్టీ సీనియర్లు పెదవి విరుస్తున్నారు. ఏమైనా మిస్టర్ కూల్‌ ఎమ్మెల్యే.. ఇప్పుడు జిల్లాలో మిస్టర్‌ హాట్‌టాపిక్‌గా మారిపోయారని జనం గుసగుసలాడుకుంటున్నారు.

Also Read: అమరావతి చట్టబద్ధతపై వైసీపీ స్టాండ్ ఏంటి? పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?